త్రివిధ దళాల్లో సైనిక నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీం దేశ యువతలో ఆందోళన కలిగిస్తోందని, దాన్ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ కోరారు. ఈ మేరకు రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్సింగ్కు శనివారం ఓ లేఖ రాశారు. ఈ స్కీంను ఉపసంహరించుకొని యువతలో భరోసా పెంచాలని వినోద్కుమార్ లేఖలో కోరారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు యువత ఆశలను నీరుగార్చేలా ఉన్నాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇది దేశానికి ఏమాత్రం క్షేమకరం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ సర్కారు మొదటినుంచీ అనాలోచిత నిర్ణయాలతో దేశ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నదని పేర్కొన్నారు.
ఆర్మీలో కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తన హృదయం గాయ పడిందని వినోద్కుమార్ తెలిపారు.
భారతదేశ సరిహద్దుల్లో ప్రమాదకర పొరుగు దేశాలు పొంచి ఉన్నాయని, జమ్మూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా శత్రువులతో ప్రమాదముందని వినోద్కుమార్ తెలిపారు. ఇలాంటి సమయంలో అగ్నిపథ్లాంటి స్కీం అమల్లోకి తీసుకురావడం ఎంత ప్రమాదకరమో తెలియదా? అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీలాంటి దేశాల్లో మిలిటరీ శిక్షణ తప్పనిసరి అని, అందు కోసం ఆయా దేశాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఆర్మీ రిక్రూట్మెంట్ చేస్తారని తెలిపారు. అలాంటి పరిస్థితులు మన దేశంలో లేవని, ఆ దేశాల పద్దతులను నకలు చేస్తే ఎలా? అని ఆయన ప్రశ్నించారు.
మోదీ సర్కారు జై జవాన్.. జై కిసాన్ నినాదాన్ని తుంగలో తొక్కిందని వినోద్కుమార్ మండిపడ్డారు. లాభాల బాటలో నడుస్తున్న రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, బీహెచ్ఈఎల్, బ్యాంకులు, వివిధ ఆయిల్ కంపెనీలు, ఈసీఐఎల్లాంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందన్నారు. ఆ కుట్రలో భాగంగానే అగ్నిపథ్ స్కీం తీసుకొచ్చారని అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా రాజుకుంటున్న ఆగ్రహ జ్వాలలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా అగ్నిపథ్ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని వినోద్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు.