హైదరాబాద్ ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : అనేక అనర్థాలు, ఎంతోమంది ఆత్మహత్యలకు కారణమవుతున్న ‘పారాక్వాట్ డైక్లోరైడ్’ అనే గడ్డిమందును నిషేధించాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఈ విషపూరిత మందుకు విరుగుడులేదని, చుక్క మింగినా ప్రాణాలు కోల్పోవాల్సిందేనని స్పష్టంచేశారు. ఈ విషయాన్ని వైద్యులు సైతం రూఢీ చేశారని తెలిపారు. శనివారం తెలంగాణ భవన్లో జడ్పీటీసీల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మ నోహర్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ఈ ప్రమాదకర గడ్డి మందును ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలు నిషేధించాయని గుర్తుచేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఒడిశా ప్రభుత్వం ఆరు నెలలు నిషేధిస్తూ జీవో జారీ చేయడమేగాకుండా ఆరు నెలలకోసారి పొడిగించుకుంటూ వెళ్తున్నదని తెలిపారు. ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. పారాక్వాట్ గడ్డిమందును తాగి నిత్యం అనేక మంది ప్రాణాలు విడుస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు.
పారాక్వాట్ గడ్డిమందును నిషేధించాలని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, సీఎస్ రామకృష్ణారావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి లేఖలు రాసినట్టు వినోద్కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తరాల ప్రతుల ను మీడియా ప్రతినిధులకు అందజేశారు. ఈ గడ్డి మందు ఇతర పురుగుమందుల కంటే భిన్నమైనదని తెలియజేశారు. ఈ గడ్డిమందును పిచికారీ చేయడంతో రైతులకు ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధ సమస్యలు వస్తున్నాయని శాస్త్రీయంగా రుజువైన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
పారాక్వాట్ డైక్లోరైడ్ తాగి తెలుగు రా ష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నారని కరీంనగర్కు చెందిన ప్రైవేట్ దవాఖాన వైద్యుడు డాక్టర్ మర్రి మహేశ్కుమార్ వెల్లడించారు. ఇది తమ బృందం అధ్యయనంలో వెల్లడైందని చెప్పారు. దీని వినియోగంపై గ్రామాల్లో తిరిగి రైతు ల్లో చైతన్యం కలిగిస్తున్నామని తెలిపారు. ఈ విషపూరిత రసాయనాన్ని తాగితే మరణమే శరణ్యమని వ్యాఖ్యానించారు. ఇంతటి ప్రమాదకరమైన మందు హెర్బీసైడ్ ఎరువుల దుకాణాల్లో విచ్చలవిడిగా లభించడంపై ఆందోళన వ్యక్తం చేశారు.