Hyderabad | హైదరాబాద్, ఆగస్టు 16: భారత సైన్యం కోసం అపాచీ హెలికాప్టర్ల తయారీని బోయింగ్ ప్రారంభించింది. అమెరికాలోని అరిజోనాలో బోయింగ్కు చెందిన మెసా ఉత్పాదక కేంద్రంలో ఏహెచ్64 అపాచీ ఈ-మాడల్ హెలికాప్టర్లు సిద్ధమవుతున్నాయి. మొత్తం 6 హెలికాప్టర్లు ఇండియన్ ఆర్మీకి డెలివరీ కానున్నాయి. కాగా, ఈ హెలికాప్టర్ల బాడీ (ఫ్యూజ్లేజ్)లు హైదరాబాద్లోని టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) ప్లాంట్లోనే రెడీ అవుతున్నాయి.
ఈ ఏడాది ఆరంభంలోనే తొలి ఏహెచ్64 అపాచీ ఈ-మోడల్ హెలిక్యాప్టర్ ఫ్యూజ్లేజ్ ఇక్కడి నుంచి అమెరికాకు చేరింది. ఈ క్రమంలోనే అక్కడి ప్లాంట్లో హెలికాప్టర్ల తయారీని మొదలుపెట్టినట్టు బోయింగ్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్టే తెలియజేశారు. 2020లో బోయింగ్.. 22 ఈ-మోడల్ అపాచీ హెలిక్యాప్టర్లను ఇండియన్ ఎయిర్ఫోర్స్కు అందజేసింది. దీంతో ఇండియన్ ఆర్మీ కోసం 6 ఏహెచ్64 అపాచీ ఈ-మోడల్ హెలిక్యాప్టర్ల కాంట్రాక్టును దక్కించుకున్నది. వచ్చే ఏడాదిలోగా వీటిని అంచాలన్నది డీల్. ఏహెచ్64ఈ.. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన దాడుల హెలిక్యాప్టర్గా పేరొందినట్టు ఈ సందర్భంగా బోయింగ్ మెసా ప్లాంట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్, అటాక్ హెలిక్యాప్టర్ ప్రోగ్రామ్స్ విభాగం ఉపాధ్యక్షుడు క్రిస్టినా ఉఫా తెలిపారు.