అచ్చంపేట : శ్రీశైలం ఎడమగట్టు ( SLBC ) సొరంగంలో జరిగిన ప్రమాదంలో మిగిలిన ఆరుగురి మృతదేహాల వెలికితీతకు బ్రేక్ పడింది. ఇప్పటివరకు 281 మీటర్లలో పేరుకుపోయిన మట్టి, బురద, శకలాలు, బండ రాళ్లు తదితర వాటిని తొలగించారు. లోకో ట్రైన్, కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తరలించారు. మిగిలిన 43 మీటర్లలో తవ్వకాలు చేపట్టాల్సి ఉండగా అక్కడ ప్రమాదకర పరిస్థితి నెలకొడంతో మృతదేహాల అన్వేషణ నిలిచిపోయింది. కేవలం టన్నెల్లో వాటర్గ్ ప్రక్రియ, మట్టి, స్టిల్ కటింగ్ లను బయటికి పంపుతున్నారు.
డేంజర్ జోన్లో ( Danger Zone) ఉన్న మృతదేహాలను బయటకి తీయాలంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆదారపడి ఉంది. ప్రభుత్వం నిర్ణయం కోసం బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి మంగళవారం నాటికి 60 రోజులు అయింది. ఆరుగురి మృతదేహాలు డేంజర్ జోన్ లోనే ఉంటాయని భావిస్తున్నారు.
డేంజర్ జోన్ లో తవ్వకాలు జరుపడానికి అవకాశం లేనందున అక్కడివరకు తవ్వకాలు జరిపి మృతదేహాల కోసం అన్వేషణ చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో మిగిలిన డేంజర్ జోన్ 43 మీటర్లు పరిధిలో మృతదేహాలుఉంటాయని భావిస్తున్నారు. డేంజర్ జోన్ లోకి వెళ్లితే సహాయక సిబ్బంది ప్రాణాలకే ముప్పు కావడంతో అక్కడి వరకే అన్వేషణ చేశారు.
డేంజర్ జోన్లోకి వెళ్లలేని ప్రమాదకరపరిస్థితి ఏర్పడడంతో మృతదేహల వెలికితీత ఎలా? అనేది ఈ నెల 24న హైదరాబాద్లో ( Hyderabad ) జరిగే టెక్నికల్ కమిటీ, నిపుణుల కమిటి తేల్చనున్నది. అంతవరకు టన్నెల్లో మిగిలిన మట్టి, బురద, స్టీల్, రాళ్లు తొలగింపు పనులు కొనసాగించనున్నారు. డివాటరింగ్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. స్టీల్ కత్తిరింపు, బండరాళ్లునులోకోట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. అయితే మృతదేహాల కోసం అన్వేషణ డేంజర్ జోన్ మినహా మిగిలిన ప్రదేశాల్లో ముగిసింది. టెక్నికల్ కమిటీ తదుపరి చర్యలపై సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. ప్రభుత్వ నిర్ణయం బట్టి డేంజర్ జోన్లో తవ్వకాలు చేపట్టనున్నారు.
మృతుల కుటుంబాలకు నిరాశ?
పేదరికంతో ఉన్న కుటుంబాలకు ఆసరాగా ఉపాధి కోసం రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చిన టన్నెల్ ప్రమాదంలో మృతిచెందిన కార్మికులు, ఇంజినీర్లు, మీషన్ ఆపరేటర్ల కుటుంబాలు కడసారి చూపుకోసం ఎదురుచూస్తున్నారు. ఎనిమిది మందిలో ఇద్దరి మృతదేహాలు లభ్యంకాగా మిగిలిన ఆరుగురి మృతదేహాల కోసం కుటుంబాలు నిరంతరం ఎదురుచూసినా ఉపయోగం లేకుండా పోయింది.
మొదట్లో ప్రభుత్వం, మంత్రులు హెలికాప్టర్లో వచ్చి హడావుడి చేసి కొన్ని రోజుల తర్వాత అధికారులకు అప్పగించేశారు. డేంజర్ జోన్ ప్రమాదకర పరిస్థితి లేకపోతే ఖచ్చితంగా శ్రమించి మృతదేహాలు బయటకు తెచ్చేవారమని రెస్య్కూ సిబ్బంది తెలిపారు. డేంజర్ జోన్లోకి వెళ్లడం అతికష్టంగా మారడంతో వెళ్లలేకపోతున్నామని, ఒకవేళ ప్రయత్నాలు చేసినా పై నుంచి కూలిపడే ప్రమాదం ఉందని తెలిపారు.