హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): మార్క్ఫెడ్లో జీఎం విష్ణువర్ధన్రావు సరెండర్ వ్యవహారం ఉత్కంఠ మలుపు తిరిగింది. విష్ణువర్ధన్ను ప్రభుత్వానికి సరెండర్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్న వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు దీనిపై మార్క్ఫెడ్ బోర్డు సభ్యులను ప్రశ్నించడంతో స్వల్ప వాగ్వివాదం కూడా జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్రావు సరెండర్ను తాను అప్రూవ్ చేయబోనని రఘునందన్రావు తేల్చి చెప్పినట్టు తెలిసింది. దీంతో ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందోననే ఉత్కంఠ కొనసాగుతున్నది. కోఆపరేటివ్ అధికారి అయిన విష్ణువర్ధన్రావు గత ఐదేండ్లుగా మార్క్ఫెడ్లో జనరల్ మేనేజర్గా డిప్యూటేషన్పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఫిబ్రవరితో డిప్యూటేషన్ గడువు ముగిసింది. అయితే ఎండీ సత్యనారాయణరెడ్డి కొత్తగా రావడం, ఫైనాన్స్ అధికారి లీవ్లో ఉండటంతో ప్రస్తుత జీఎం వెళ్లిపోతే పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో డిప్యూటేషన్ను మరోసారి పొడగించేందుకు ఫైల్ ప్రాసెస్ చేశారు. దీనిపై బోర్డు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది. తొలి నుంచి జీఎం విష్ణువర్ధన్రావుపై బోర్డు సభ్యులు తీవ్ర అసహనంతో ఉన్నారు. దీనికితోడు జీఎం మార్క్ఫెడ్ జనరల్బాడీ సమావేశం నిర్వహించకుండా తమను ఇబ్బందుల్లోకి నెట్టారనే కోపం వారిలో ఉన్నది. జీఎం నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు లీగల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నదనే ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విష్ణువర్ధన్రావును మళ్లీ కొనసాగించేందుకు ఇష్టంలేని బోర్డు ఆయనను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని నిర్ణయించింది. ఇది ఇప్పుడు వివాదంగా మారింది.
నామమాత్రం గా బోర్డు
కార్పొరేషన్లో బోర్డు పాత్ర ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే పలుమార్లు వివాదం రేగింది. తాజా పరిణామాలతో మరోసారి బోర్డు అధికారాలపై చర్చ మొదలైంది. బోర్డు విధులేమిటి? అధికారాలేమిటి? అని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. తమను ఏ కమిటీలోనూ సభ్యులుగా చేర్చడం లేదని, ఎలాంటి అధికారాలు అప్పగించడం లేదని, మొత్తంగా ఎన్నికైన బోర్డును నామమాత్రం చేసేశారని ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. కార్పొరేషన్లో ప్రతి నిర్ణయానికి ప్రభుత్వ అనుమతి తీసుకుంటే ఇక బోర్డు ఎందుకని ప్రశ్నించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జీఎం సరెండర్ అంశం, బోర్డు అధికారాల వివాదం ఎక్కడికి దారితీస్తుందోననే చర్చ జరుగుతున్నది.