వనపర్తి : తెలంగాణలో నీలి విప్లవం మొదలైందని, ఉచితంగా చేపపిల్లలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని దేవవకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం లేదన్నారు. బుధవారం మదనాపురం మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్టులో 8,07,500 చేపపిల్లలు, 2,66,000 రొయ్య పిల్లలు వదిలారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. మత్స్యకారులకు అవసరమైన చోట చేపల మార్కెట్లను నిర్మిస్తాంమని తెలిపారు.
సరళాసాగర్లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.
చెరువులు నిండాలి. పంటలు పండాలి. చెరువులు చేపలతో కళకళలాడాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ కల అన్నారు. పేదల ఆకలి తెలిసిన నేత కేసీఆర్ అని ప్రశంసించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.