హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా ఎప్పటికప్పుడు నియామకాలు చేపడుతున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. గురువారం నాంపల్లిలోని ఏరియా దవాఖానను సందర్శించి డయాలసిస్ కేంద్రం, బ్లడ్బ్యాంక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఒకో బెడ్కు నెలకు రూ.7,500 ఖర్చు చేస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉస్మానియా, గాంధీ, నిమ్స్లో మాత్రమే ఉచిత డయాలసిస్ సెంటర్లు ఉండేవని.. ప్రస్తుతం 102కు పెంచామని వెల్లడించారు.
రాష్ట్రంలో దాదాపు 12 వేల మంది డయాలసిస్ చేయించుకుంటుంటే, వారిలో 10 వేల మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్ చేయిస్తున్నదని వివరించారు. మన విధానం అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఏటా 150 వరకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయిస్తున్నామని, వీటికి కార్పొరేట్ దవాఖానల్లో రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా కిడ్నీ రోగుల కోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నదని, ఇందులో డయాలసిస్ రోగుల కోసమే రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నదని వివరించారు. రాష్ట్రం ఏర్పడేనాటికి 28 ప్రభుత్వ బ్లడ్బ్యాంకులు ఉంటే, ఇప్పుడు 56కు పెంచామన్నారు. ఇలాంటి అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలు, పథకాలతో రాష్ట్ర వైద్యారోగ్య రంగం దేశానికే దిక్సూచిగా నిలిచిందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గర్భిణులు, పుట్టబోయే పిల్లల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ను ఒకట్రెండు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి హరీశ్రావు చెప్పారు. దాదాపు 6.5 లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం చేకూర్చే ఈ పథకం కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. ఇప్పటికే లక్ష న్యూట్రిషన్ కిట్లను జిల్లాలకు పంపించామని, మరో లక్ష కిట్లు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఈ కిట్ల ద్వారా పుట్టబోయే పిల్లల్లో ఎదుగుదల లోపాలను నివారించవచ్చని చెప్పారు.