(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో బుధవారం దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో సెక్యూరిటీ డ్రిల్స్ను నిర్వహించనున్నారు. దీంతో అసలు సెక్యూరిటీ డ్రిల్ అంటే ఏమిటి? ఎందుకు నిర్వహిస్తారు? గతంలో ఎప్పుడైనా నిర్వహించారా? డ్రిల్ నిర్వహణలో ఉండే క్యాటగిరీలేమిటి? అనే చర్చ జరుగుతున్నది.
ఏమిటీ సెక్యూరిటీ డ్రిల్?
సెక్యూరిటీ మాక్ డ్రిల్ అనేది ఒక రక్షణకు సంబంధించిన శిక్షణ ప్రక్రియ. రక్షణ వ్యవస్థ పనిచేస్తున్నదా లేదా అని పరీక్షించి, భవిష్యత్తులో ప్రాణనష్టం జరగకుండా ముందస్తుగా ప్రతిస్పందించడానికి అనుసరించే మార్గం. ప్రమాదం జరుగడానికి ముందే.. ఆ ప్రమాదానికి ఎలా ప్రతిస్పందించాలో ప్రాక్టీస్ చేయడంగా దీనిని పేర్కొనవచ్చు.
ఎందుకు నిర్వహిస్తారు?
ప్రజలలో అప్రమత్తత కల్పించడానికి, సిబ్బంది వెంటనే స్పందించి, నైపుణ్యతతో పరిస్థితులను చక్కదిద్దడానికి, సాంకేతిక లోపాలను ముందుగా గుర్తించి సరిచేసుకోవడానికి, ఎమర్జెన్సీ సమయంలో ప్రతిస్పందన బృందాలు సమన్వయంతో ఏ మేరకు పనిచేయగలవో పరీక్షించడానికి ఈ డ్రిల్ను నిర్వహిస్తారు.
ఏ సమయాల్లో డ్రిల్ చేపడతారు?
యుద్ధం, ఉగ్రదాడులు, బహుళ అంతస్తుల భవనాలు-దవాఖానల్లో అగ్నిప్రమాదం, భూకంపం, వరదలు, తుఫాన్లు, కెమికల్ లీకేజీ వంటి సందర్భాల్లో సాధారణంగా ఈ డ్రిల్ను నిర్వహిస్తారు. ఆయా వ్యక్తులు, సంస్థలకు ముందుగా తెలిపి కానీ, తెలపకుండా హఠాత్తుగా గానీ ఈ డ్రిల్స్ను నిర్వహిస్తారు.
సెక్యూరిటీ డ్రిల్స్లో ఉండే ప్రధాన దశలు
ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరన్లు: సెక్యూరిటీ డ్రిల్లో ఇది కీలకమైన దశ. వైమానిక దాడులు జరిగే సమయంలో ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరన్లను మోగిస్తారు. ధ్వని తీవ్రత 110 డెసిబిల్స్ నుంచి 140 డెసిబిల్స్ వరకూ ఉంటుంది. కనిష్ఠంగా 30 సెకండ్లపాటు ఈ వార్నింగ్ సైరన్లు మోగుతాయి. సైరన్ వినిపించగానే ప్రతీఒక్కరూ ఇండ్లల్లో సురక్షిత ప్రదేశాల్లో దాక్కోవాలి. బయట వీధుల్లో ఉండేవారు లోతట్టు ప్రాంతానికి చేరుకొని పై కప్పు ఉన్న ఏదైనా వసారాలో నేలపై పడుకోవాలి.చెవులను గట్టిగా మూసుకోవాలి.
బంకర్లు: దాడులు మొదలైన సందర్భంలో పౌరులు ప్రాణాలను కాపాడుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. భూమి లోపల తవ్విన బంకర్ల వంటి నిర్మాణాల్లో దాక్కోవడం ఉత్తమం. ఉద్రిక్తతలు ఎక్కువగా ఉండే కశ్మీర్లోని ఉరి ప్రాంతం, అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని అర్నియా ప్రాంతాల్లో ప్రభుత్వం ఇప్పటికే పౌరుల కోసం కొన్ని కమ్యూనిటీ బంకర్లను సిద్ధం చేసింది.
క్రాష్ బ్లాకౌట్స్: రాత్రిళ్లు జరిగే దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఈ అంచెను అనుసరిస్తారు. ఈ విధానంలో ఇండ్లల్లోని దీపాలన్నింటినీ ఆర్పేయాలి. స్ట్రీట్ లైట్లు కూడా నిలిపేస్తారు. మొత్తంగా జనావాసాలు అక్కడ ఉన్నాయా? లేదా? అనే భ్రమను శత్రువులకు కల్పిస్తారు.
కేమోఫ్లాజ్ విధానం: సైనిక స్థావరాలు, విద్యుత్తు స్టేషన్లు, ప్రభుత్వ భవనాలు, రక్షణ రంగ సంస్థలు, కమ్యూనికేషన్ హబ్స్ వంటి కీలమైన ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో కూడా గుర్తుపట్టడానికి వీళ్లేకుండా ఉండేందుకు ఈ కేమోఫ్లాజ్ విధానాన్ని అనుసరిస్తారు. ఉపగ్రహాలు, గగనతల నిఘా, దాడుల నుంచి తప్పించుకోవడానికి ఇలా చేస్తారు. 1971 యుద్ధంలో ఆకుపచ్చని జూట్ వస్త్రంతో కప్పి కేమోఫ్లాజ్ విధానంలోనే తాజ్మహల్ను రక్షించారు.
ట్రైనింగ్ సివిలియన్స్: దాడుల సమయంలో తొక్కిసలాట, గందరగోళం జరగకుండా నియమిత విధానంలో బయటకు ఎలా వెళ్లాలో పౌరులకు శిక్షణనిస్తారు. ప్రమాదంలో చిక్కుకొని గాయపడ్డ వారిని ఎలా కాపాడాలో పౌరులకు నేర్పిస్తారు. సురక్షిత ప్రాంతానికి వెళ్లిన తర్వాత హాజరు నమోదు ఎలా చేయాలో కూడా చెప్తారు.
ఎమర్జెన్సీ రెస్పాన్స్: అత్యవసర పరిస్థితి ఏర్పడిన వెంటనే అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్లు, బృందాలు ఘటనా స్థలికి చేరుకుంటాయి. లోపల ప్రమాదంలో చిక్కుకున్న లేదా బందీలైన వ్యక్తులను బయటకు తీసుకురాగలుగుతామా? అని డ్రిల్లో భాగంగా పరీక్షిస్తారు. ఉగ్రదాడి అయితే ఉగ్రవాదులను కట్టడి చేసే అవకాశాలను, ప్రక్రియను ఆచరిస్తారు. అలాగే ఆపరేషన్ అయిన తర్వాత ప్రతిస్పందన సమయం నమోదు చేస్తారు. అన్ని శాఖలు, విభాగాలపై సమీక్ష జరిపి ఏ విభాగంలో లోపాలున్నాయి, ఎందులో మెరుగుదల అవసరం వంటి అంశాలను డ్రిల్లో సమీక్షిస్తారు.
1971 యుద్ధ సమయంలో ఇలా..
1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసమని భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో పౌరుల భద్రత కోసమని అప్పటి ప్రభుత్వం యుద్ధానికి ముందు సెక్యూరిటీ డ్రిల్స్ను నిర్వహించింది. యుద్ధ సమయంలో సాయంత్రం 6.30 కల్లా ప్రతీఒక్కరూ ఇండ్లకు చేరుకొనేవారు. సైరన్ వినిపించగానే ప్రతీ ఒక్కరూ లైట్లు ఆర్పేసి ఇండ్లల్లో సురక్షిత ప్రదేశాల్లో దాక్కొనేవారు. నేలపై పడుకొనేవారు. చెవులను గట్టిగా మూసుకొనేవారు. ఆ సమయాల్లో పెద్దగా మాట్లాడటం కూడా ఉండేది కాదు. పాక్ సేనలు తాజ్మహల్పై దాడులకు పాల్పడే ప్రమాదమున్నదన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఆ కట్టడం శత్రువు కంటపడకుండా పరిసరాల్లో కలిసిపోయేట్టు కనిపించడానికి దానిపై ఆకుపచ్చటి జూట్ వస్ర్తాన్ని (కేమోఫ్లాజ్ వస్త్రం) కప్పారు.