హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా పుల్లూరులో 24వ జైన తీర్థంకరుడైన మహావీరుని నల్లరాతి శిల్పాన్ని కనుగొన్నారు. పద్మాసనంలో కూర్చొని నగ్నంగా ధ్యానముద్రలో ఉన్న ఈ శాసన శిల్పం పాముల పుట్టలో బయల్పడింది. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి బుధవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. గ్రామం చివర గిరన్న దిబ్బపై శిథిల జైనాలయం పక్కన మహావీరుని శిల్పంతోపాటు మాతంగ యక్షుని శిల్పాలు పాముల పుట్టలో కూరుకుపోయాయని వెల్లడించారు. క్రీ.శ.10వ శతాబ్దంలో చాళుక్యుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం కాలక్రమంలో కూలిపోయి, శిథిలమైందని తెలిపారు. వెయ్యేండ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని, జైన శిల్పాలను కాపాడి భావితరాలకు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.