హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): నల్ల కాగితాలను రసాయనంతో కడిగితే రూ.500 నోట్లుగా మారుతాయంటూ అమాయకులను మోసగిస్తున్న విదేశీ ముఠాను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫుడ్ డెలివరీ బాయ్గా జొమాటోలో పనిచేస్తున్న బోడుప్పల్ వాసి విష్ణువర్ధన్రెడ్డి ఈ ముఠా చేతిలో రూ.5 లక్షలు మోసపోయినట్టు ఫిర్యాదు అం దడంతో కామెరూన్ దేశానికి చెందిన కొంబి ఫ్రాంక్ సెడ్రిక్, మాలే దేశానికి చెందిన గోటి సౌంగలో అనే నిందితుల ను అరెస్టు చేసినట్టు రాచకొండ సీపీ సుధీర్బాబు బుధవారం వెల్లడించారు.
వారి నుంచి రూ.25 వేల నకిలీ కరెన్సీ నోట్లు, కెమికల్స్, మొబైల్ ఫోన్, పాస్పోర్టు, ఐరన్ బాక్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కొంబి ఫ్రాంక్ సెడ్రిక్ వీసా గడువు ముగిసినప్పటికీ ఢిల్లీ, గుర్గావ్లో 2020 నుంచి అక్రమంగా నివసిస్తున్నాడని, ఈ ముఠాలోని ఇతర సభ్యుల కోసం గాలిస్తున్నామన్నారు.