బ్లాక్ ఫంగస్ అనేది కొత్తవ్యాధి ఏమీకాదని.. గతంలో పలువురు దీని బారిన పడిన వారికి చికిత్సలు అందించామని కోఠి ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. బ్లాక్ఫంగస్ను ఆదిలోనే గుర్తిస్తే ఎండోస్కోపీతో సులువుగా నియంత్రించవచ్చని చెప్పారు. కొవిడ్ నుంచి కోలుకున్నవారిని మళ్లీ వణికిస్తున్న బ్లాక్ ఫంగస్పై ముందుగానే అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం నోడల్ కేంద్రాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్లాక్ఫంగస్ బారినపడిన ముగ్గురికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించిన కోఠి ఈఎన్టీ వైద్యబృందం మరో ముగ్గురికి సంబంధిత ఎస్ఈఎస్ఎస్ (సెస్) శస్త్రచికిత్స నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నది. కోఠి ఈఎన్టీలో 30-50 పడకలతో నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు డాక్టర్ శంకర్ తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ ఈ సేవలను విస్తరించే అవకాశమున్నదని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడారు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 16 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్: కొవిడ్ నుంచి కోలుకొన్నవారిలో పలువురు బ్లాక్ ఫంగస్ వ్యాధి బారిన పడుతున్నారనేది వాస్తవం. కాకపోతే ఈ వ్యాధి ఇప్పుడే కొత్తగా వచ్చిందేమీ కాదు. 1985లోనే బ్లాక్ ఫంగస్ వ్యాధిబారిన పడి గాంధీ దవాఖానలో ఓ మహిళ మృతి చెందిన ఘటన ఉన్నది. గతంలో కోఠి ఈఎన్టీలోనూ వైద్యసేవలు పొందినవారున్నారు. ఏడాదికి ఒకట్రెండు కేసులు వచ్చేవి. అత్యధికంగా స్టెరాయిడ్స్, యాంటీబాడీస్ మందులు వాడకం, కలుషిత నీరు తాగడం, ఆక్సిజన్ అందించడంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల మనిషి శరీరంలోకి బ్లాక్ ఫంగస్ ప్రవేశిస్తుంది. శరీరంలోని మంచి బ్యాక్టీరియా పూర్తిగా నశించడంవల్ల బ్లాక్ఫంగస్ వృద్ధి చెందుతుంది.
శ్వాస సరిగా ఆడకపోవడం, ముక్కు పుటలాలు పూర్తిగా మూసుకుపోయినట్టుగా మారడం, చీమిడిలో నల్లని చారలు (బ్లాక్ స్పాట్స్)గానీ పడుతుంటే బ్లాక్ఫంగస్ అని నిర్ధారించవచ్చు. తలనొప్పి, జ్వరం, కండ్ల మంటలు లక్షణాలు కూడా ఉంటాయి. ప్రాథమిక దశలోనే గుర్తించి శస్త్రచికిత్స చేయడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. ఆదిలోనే గుర్తిస్తే ముందుగా ఎండోస్కోపీ ద్వారా ముక్కులో నుంచి బ్లాక్ఫంగస్ను పూర్తిగా తొలగించే అవకాశం ఉంటుంది. తర్వాత దాదాపు వారంపాటు రోజూ డ్రెస్సింగ్ చేసుకుంటూ.. యాంటీ ఫంగస్ చికిత్సను కొనసాగిస్తే కండ్లు, మెదడుకు ఫంగస్ చేరకుండా నిలువరించవచ్చు.
వారం రోజుల్లో బ్లాక్ ఫంగస్ బారినపడిన ముగ్గురికి విజయవంతంగా ఎస్ఈఎస్ఎస్ (సెస్) శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడాం. ఆదివారం కింగ్కోఠి జిల్లా దవాఖానలో కొవిడ్ బారినపడి ఆక్సిజన్ పడకపై చికిత్స పొందుతున్న ఓ రోగికి బ్లాక్ఫంగస్ లక్షణాలు కనిపించడంతో కోఠి ఈఎన్టీకి తరలించాం. మరో ముగ్గురికి సెస్ శస్త్ర చికిత్స ద్వారా వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశాం. ఈ ప్రక్రియలో సరోజినీదేవి కంటి దవాఖాన వైద్యుల సూచనలను సైతం పరిగణనలోకి తీసుకుంటాం. ముక్కుద్వారా ఫంగస్ నియంత్రణ చేపట్టనున్న క్రమంలో ఆఫ్తాల్మాజిస్టులను కూడా భాగస్వాములను చేసి ఎంతమేరకు ఫంగస్ను క్లియర్ చేయవచ్చు.. కండ్లపై ప్రభావం పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై సూచనలు తీసుకుంటాం.
పోస్టు కొవిడ్ బ్లాక్ ఫంగస్ కేసులను కోఠి ఈఎన్టీ నోడల్ కేంద్రానికి తరలించి వైద్యసేవలు అందిస్తాం. కచ్చితంగా నెగెటివ్ రిపోర్టు ఉంటేనే సదరు రోగికి ఇక్కడ అనుమతిస్తాం. ఒకవేళ ఇంకా కోలుకోని పక్షంలో (పాజిటివ్గా ఉంటే) గాంధీ దవాఖానలోనే ఉంచి కొవిడ్ చికిత్సను కొనసాగిస్తూనే మరోవైపు ఫంగస్ కండ్లు, మెదడుకు చేరకుండా యాంటీ ఫంగస్ చికిత్స అందిస్తాం. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎక్కడ కేసు నమోదైనా పోస్టు కొవిడ్ అయితే కోఠి ఈఎన్టీ, ప్రీ కొవిడ్ అయితే గాంధీలో ఉంచి వైద్య సేవలు అందిస్తాం.