కొత్తపల్లి, డిసెంబర్ 30 : ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో తెరవెనుక ప్రధాన సూత్రధారిగా ఉన్న బీఎల్ సంతోష్ ఎప్పటికైనా జైలుకు వెళ్లక తప్పదని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ అన్నారు. దేశంలోని నాలుగు రాష్ర్టాల్లో బీజేపీ అక్రమంగా అధికారంలోకి రావడం వెనుక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) అయిన సంతోష్ పాత్ర ఉన్నదని ఆయన ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీందర్సింగ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో సంతోష్ ప్రమేయం లేకుంటే సిట్ విచారణ కోసం అధికారుల ముందుకు రాకుండా ఎందుకు రెండుసార్లు వాయిదా వేసుకున్నారని ప్రశ్నించారు. ఇదే అంశంలో దొరికిన ఆడియో టేపుల్లో పలుమార్లు స్వామిజీలతోపాటు ఇతరులు బీఎల్ సంతోష్ పేరును ప్రస్తావించారని, దీనికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సిట్తో జైలుపాలుకాక తప్పదని గుర్తించిన బీజేపీ నాయకులు.. కేసును సీబీఐకి మళ్లించేలా కోర్టులో కేసులు వేశారని ఆరోపించారు. బీఎల్ సంతోష్ ఏ తప్పూ చేయనప్పుడు సిట్ విచారణను ఎదుర్కొని సమాధానం చెప్పాల్సి ఉండగా కోర్టుల్లో కేసులు వేసి శిక్షల నుంచి తప్పించుకొనేందుకు ఈ కేసును సీబీఐకి బదిలీ చేయించుకున్నారని విమర్శించారు. మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి సంబంధమూ లేనప్పటికీ సీఎం కేసీఆర్ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు ఈడీ, ఐటీలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ తప్పుడు నిర్ణయాలు, విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నది ఒక్క సీఎం కేసీఆరేనని తెలిపారు. బీఆర్ఎస్ పాలనకోసం దేశమంతా ఎదురుచూస్తున్నదని చెప్పారు.