(ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి) : రోహింగ్యా శరణార్థుల విషయంలో బీజేపీ నేతలకు సైద్ధాంతికపరంగా స్పష్టమైన వైఖరి లేదని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తాజా ప్రకటనతో మరోసారి రుజువైంది. రోహింగ్యాలను దేశం నుంచి తరిమి కొడతామని, వారిపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఒకవైపు కమలదళం నేతలు ప్రకటనలు గుప్పిస్తుంటే, బుధవారం ఉదయం పురీ మాట్లాడుతూ.. రోహింగ్యాలకు ఢిల్లీలో ఫ్లాట్లు ఇస్తామని, పోలీసు భద్రతతో పాటు యూఎన్హెచ్ఆర్సీ ఐడీ కార్డులు కూడా జారీ చేస్తామని ప్రకటించారు. పురీ ప్రకటనతో బీజేపీలో కలకలం రేగింది. దీంతో కీలక నేతలు, సంఘ్ పరివార్ సభ్యులు ఈ విషయాన్ని ఆఘమేఘాల మీద అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ అంశంపై అధిష్టానం పెద్దలు లోతుగా చర్చించారు.
మధ్యాహ్నం నాటికి కేంద్రహోంశాఖ రంగంలోకి దిగింది. రోహింగ్యాలకు ఫ్లాట్లు ఇస్తామని కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. చట్టప్రకారం అక్రమ విదేశీయుల బహిష్కరణ పూర్తయ్యేవరకూ వారిని నిర్బంధ క్యాంపుల్లో ఉంచాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోహింగ్యాలను అనుమతించేది లేదని వీహెచ్పీ కూడా హడావుడిగా ప్రకటన జారీ చేసింది. బీజేపీ మంత్రుల మధ్యే సైద్ధాంతికపరంగా భిన్న అభిప్రాయాలు ఉన్నాయని, దీనిపై ప్రధాని మోదీ ఏం చెప్తారని విపక్షాలు ప్రశ్నిస్తున్నారు.