జనగామలో టీఆర్ఎస్ శ్రేణులపై దాడులు
పథకం ప్రకారం రాళ్లు, కర్రలతో అరాచకం
జనగామ, ఫిబ్రవరి 9 : తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ అనుచిత వ్యాఖ్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాషాయమూకలు చెలరేగిపోయాయి. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా అరాచకం సృష్టించాయి. ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి పాల్గొని శాంతియుతంగా నిర్వహిస్తున్న బైక్ ర్యాలీపై దాడికి దిగారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, రాళ్లతో టీఆర్ఎస్ ర్యాలీపై బీజేపీ కార్యకర్తలు దాడికి తెగబడడంతో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు మసియొద్దీన్, పురుషోత్తం సహా మరో ఐదుగురు కార్యకర్తల తలలకు గాయాలయ్యాయి. కమలం పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.