హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రబల రాజకీయ శక్తిగా, ప్రజల హక్కుగా ఉన్న టీఆర్ఎస్ను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. టీఆర్ఎస్పై బీజేపీ చేస్తున్న కుట్రలు ఎన్నటికీ నెరవేరబోవని స్పష్టంచేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్తో కలిసి వినోద్కుమార్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయటంలేదని ప్రజలను నమ్మించి, కొందరు టీఆర్ఎస్ నేతలను మభ్యపెట్టి ఎన్నికల బరిలో నిలిపి గులాబీదళం ఓటుబ్యాంకు చీల్చాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్ర చేశాయని విమర్శించారు. కరీంనగర్లో రవీందర్సింగ్ను అడ్డు పెట్టుకొని బీజేపీ ఇలాంటి కుట్రే చేసిందని మండిపడ్డారు. నిజాయితీగల నాయకులు, కార్యకర్తలు విపక్షాల కుట్రలను ముందే గుర్తించి ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పారని అన్నారు. బీజేపీ.. దేశానికి పట్టిన శని అని నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే టీఆర్ఎస్పై, రాష్ట్ర ప్రగతిపై సోషల్ మీడియాలో బీజేపీ దుష్ప్రచారం మొదలుపెట్టిందని విమర్శించారు. కరీంనగర్లోని ఒక ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై టీఆర్ఎస్పై దుష్ప్రచారం చేశాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. 56 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని సోషల్ మీడియాలో బీజేపీ తప్పుడు ప్రచారానికి తెరలేపిందని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో బీజేపీ ఉండి ఉంటే ఇప్పటికే దేశమంతా విచ్ఛిన్నమయ్యేదని పేర్కొన్నారు. బీజేపీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించలేదని, విస్తరించే అవకాశం అసలే లేదని తేల్చిచెప్పారు. బీజేపీ కూడా ఒక పెద్ద ప్రాంతీయ పార్టీయేనని అన్నారు. భారతదేశం రాష్ర్టాల సమాఖ్య అన్న రాజ్యాంగ స్ఫూర్తికి బీజేపీ విఘాతం కలిగిస్తూ రాష్ర్టాల హక్కులను కాలరాసే కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీని ఎదుర్కోవటం కాంగ్రెస్కు చేతకాదని, దేశవ్యాప్తంగా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలే ఆ పనికి పూనుకుంటాయని స్పష్టంచేశారు.
ఇది చరిత్రాత్మక విజయం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ చరిత్రాత్మక విజయం సాధించిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్పై ఉన్న ప్రజాభిమానాన్ని చెదరగొట్టలేవని స్పష్టంచేశారు. ఈ ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టు అని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో బద్ధశత్రువులుగా ఉంటూ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాయన్న నిజం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మరోసారి రుజువైందని అన్నారు.
తాలిబన్లకు బీజేపీకి తేడా ఏమిటి?
మత ఛాందసవాదంతో విద్యావ్యవస్థను బీజేపీ ధ్వంసం చేస్తున్నదని కొప్పుల మండిపడ్డారు. స్త్రీలు చదువుకోవటం వల్ల కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని సీబీఎస్ఈ సిలబస్లో పెడతారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్త్రీలు చదువరాదన్న తాలిబన్లకు బీజేపీకి తేడా ఏమిటని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి దమ్ముంటే ఇలాంటి సిలబస్ను రూపొందించిన వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్చేశారు.