హైదరాబాద్, జనవరి 4 : కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సమావేశాలు నిర్వహిస్తారా? హాజరైనవారు టీకా తీసుకొన్నారో లేదో.. వారికి ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నలు అడిగింది ఎవరో కాదు- సాక్షాత్తు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో జరిగిన తొక్కిసలాటపై భాటియా మంగళవారం పై ప్రశ్నలు సంధించారు. తొక్కిసలాటకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లో అలా స్పందించిన బీజేపీ తెలంగాణలో మరోలా వ్యవహరిస్తున్నది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి, దీక్ష పేరుతో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన బండి సంజయ్ని అరెస్టు చేస్తే నానా యాగీ చేస్తున్నది. దీక్షకు వచ్చినవారికి కరోనా సోకినా, వారి వల్ల కరీంనగర్ జిల్లాలో వ్యాధి ప్రబలినా ఎవరు బాధ్యత వహిస్తారో బీజేపీ సమాధానం ఇవ్వలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధించిన నిబంధనలనే ఎందుకు ఉల్లంఘించారో రాష్ట్ర బీజేపీ నేతలు స్పష్టం చేయాల్సి ఉన్నది.
నడ్డా.. సమాధానం ఇస్తారా?
కొవిడ్ నిబంధనలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే రూపొందించింది. వాటిని అమలు చేసే బాధ్యతను రాష్ర్టాలకు అప్పగించింది. నిబంధనలు కఠినంగా పాటించాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ర్టాలకు లేఖలు రాస్తున్నది. రాష్ట్రంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 25న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలను స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉల్లంఘించడం తప్పో కాదో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పాల్సి ఉన్నది.