హైదరాబాద్, సిటీబ్యూరో/బండ్లగూడ/చంచల్గూడ, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): నంబర్-2 అంటే ఎవరు? తుషార్, సంతోష్జీ పాత్ర ఏమిటి? ఎమ్మెల్యేల కొనుగోలుకు వందల కోట్ల డబ్బులు ఎవరిస్తారు? బీజేపీలో మీ పాత్ర ఏమిటి? అంటూ.. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించి పట్టుబడిన బ్రోకర్లపై సిట్ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
రంగంలోకి దిగిన సిట్ పోలీసులు.. గురువారం కోర్టు అనుమతితో చంచల్గూడ జైలు నుంచి ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్లను తమ కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం వారిని రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయానికి తరలించి విచారించారు. ఈ విచారణలో 42 అంశాలతో కూడిన ప్రశ్నావళిని ముందుపెట్టి, నిందితుల నుంచి సమాధానాలను రాబట్టేందుకు ప్రయత్నించారు.
బ్రోకర్ల వెంట ఉన్నదెవరు? వందల కోట్ల రూపాయలు ఎక్కడినుంచి వస్తున్నాయి? ఎమ్మెల్యేలకు ఎలా ఇవ్వాలనుకున్నారు? కోడ్ భాషలోని వివిధ పదాలకు అసలు అర్థాలేమిటి? ఎమ్మెల్యేలను కొనాలనే ఆలోచన ఎక్కడినుంచి పుట్టింది? ఎవరు ప్రోత్సహించారు? ఇందుకోసం ఎన్నిసార్లు హైదరాబాద్కు వచ్చివెళ్లారు? నకిలీ గుర్తింపు కార్డులను ఎవరి సహాయంతో సృష్టించారు? వాటితో ఏం చేయాలనుకున్నారు?.. ఇలా పలు ప్రశ్నలను పోలీసులు సంధించారు. గత నెల 26వ తేదీన మొయినాబాద్లోని ఫామ్హౌస్లో ఎమ్మెల్యేలతో బేరసారాలాడుతూ ఫరీదాబాద్కు చెందిన రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మ, తిరుపతికి చెందిన సింహయాజి, హైదరాబాద్కు చెందిన నందకుమార్.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి బీజేపీలో చేర్పించుకోవడానికి రామచంద్రభారతి ఆధ్వర్యంలో ప్రయత్నిస్తూ.. ఢిల్లీ, యూపీ పెద్దలతో ఫోన్లలో మాట్లాడారు. ఫామ్హౌస్లో మూడున్నర గంటలపాటు ఎమ్మెల్యే కొనుగోలుకు ఈ ముగ్గురు జరిపిన కుట్ర వీడియో, అడియోలను పోలీసులు రికార్డు చేసి అరెస్ట్ చేశారు. నిందితులు ముగ్గురిని విచారించేందుకు నాంపల్లిలోని ఏసీపీ స్పెషల్ కోర్టు బుధవారం అనుమతించడంతో ఆ ముగ్గురు దూతలను పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. రామచంద్రభారతి, సింహయాజిలను నందకుమారే ఒకచోటకు చేర్చి, యాగాల పేరుతో ఎమ్మెల్యే రోహిత్రెడ్డితో పరిచయం పెంచుకున్నారని.. పార్టీ మారాలని ప్రలోభాలకు గురిచేశారని విచారణలో వెల్లడైంది.
పొంతనలేని సమాధానాలు
నిందితుల నుంచి రాబట్టాల్సిన సమాధానాలపై 42 ప్రశ్నలతో సిట్ అధికారులు ప్రశ్నావళిని తయారుచేశారు. గురువారం ఉదయం ఈ ప్రశ్నలపై ఒక్కొక్కరిని వేర్వేరుగా, మధ్యా హ్నం కలిపి ప్రశ్నించారు. 17 ప్రశ్నలకు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడారు. వీటిపై శుక్రవారం విచారణలో స్పష్టత తీసుకునేందు కు ప్రయత్నిస్తున్నారు. కస్టడీ పూర్తయ్యాక నిం దితులను చంచల్గూడ జైలుకు తరలించారు.
సిట్ కస్టడీలో సీన్-1
నిందితులు ముగ్గురిని శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఇన్స్పెక్టర్ లక్ష్మీరెడ్డి ముందుగా విచారించారు. అనంతరం ఈ విచారణలో సిట్ సభ్యుడైన సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్, ఎస్ఓటీ అదనపు డీసీపీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు విచారణ సాగిందిలా..
దర్యాప్తులో మూడు ప్రత్యేక విభాగాలు
ప్రభుత్వాన్ని కూల్చే కుట్రపై దర్యాప్తు చేస్తున్న సిట్లో మూడు విభాగాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఏర్పాటుచేశారు. సిట్ సభ్యులు గురువారం సమావేశమై, ఈ కేసు దర్యాప్తును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై చర్చించినట్లు తెలిసింది. నిందితుల నుంచి సేకరించే వివరాలు, సాంకేతిక అంశాలు, డాక్యుమెంటేషన్ ఇలా విభజించి మూడు బృందాలకు అప్పగించారు. నిందితుల నుంచి తొలిరోజు సేకరించిన వివరాలను విశ్లేషించిన సిట్ అధికారులు.. నిందితుల నుంచి మున్ముందు సేకరించాల్సిన సమాచారంపై బృందం సభ్యులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. దీంతోపాటు విచారణలో వెల్లడవుతున్న అంశాలను పరిగణలోకి తీసుకుని కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ముంబయి, హర్యానా తదితర రాష్ర్టాలకు ప్రత్యేక బృందాలను పంపేందుకు తెలంగాణ పోలీసులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.