హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): అన్ని రంగాల్లోనూ ‘డబుల్ ఫెయిల్యూర్’గా ఘనతకెక్కిన బీజేపీ రాష్ర్టాలు.. కనీసం శిశు సంరక్షణలోనూ శ్రద్ధ చూపడం లేదు. నవజాత శిశువుల సంరక్షణ కోసం ఏర్పాటుచేసిన ఎస్ఎన్సీయూల్లో (స్పెసిఫిక్ న్యూబార్న్ కేర్ యూనిట్స్) నమోదైన మరణాలపై కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. 2019-2022 మధ్య రాష్ర్టాలవారీగా శిశుమరణాల సంఖ్యను వెల్లడించింది.
ఈ జాబితాలో బెంగాల్ తర్వాత బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నది. రాజస్థాన్ మూడో స్థానంలో ఉండగా.. బీజేపీ పాలిత మరో రాష్ట్ర ఉత్తరప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. వీటితో పోల్చితే తెలంగాణ మెరుగైన ఫలితాలు సాధించింది. 18 పెద్ద రాష్ర్టాల జాబితాలో తెలంగాణ 14వ స్థానంలో ఉండటం శిశు సంరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం.
కేంద్ర గణాంకాల ప్రకారం.. తెలంగాణలో 2021-22లో ఎస్ఎన్సీయూ మరణాలు 1,904 నమోదయ్యాయి. బీజేపీ ఏలుబడిలోని మధ్యప్రదేశ్లో మరణాలు 13,316. తెలంగాణ కంటే మధ్యప్రదేశ్లో దాదాపు ఏడు రెట్లు అధికంగా మరణాలు నమోదయ్యాయి. అస్సాంలో 4,076 మరణాలు నమోదయ్యాయి. అంటే తెలంగాణతో పోల్చితే ‘డబుల్’. ఇక మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో 6,295 మరణాలు నమోదయ్యాయి. తెలంగాణతో పోల్చితే యూపీలో నాలుగు రెట్లు, కర్ణాటకలో మూడురెట్లు, మహారాష్ట్రలో రెండున్నర రెట్లు అధిక మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా టాప్-10 రాష్ర్టాల్లో బీజేపీ పాలిత రాష్ర్టాలు నాలుగు ఉండటం గమనార్హం.