హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాని మోదీపై చూపుతున్న అభిమానం శ్రుతిమించి భజనగా మారుతున్నది. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ ఓవైపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే.. బండి మాత్రం మోదీని అంబేద్కర్ వారసుడంటూ చెప్పుకొచ్చారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో బండి మాట్లాడుతూ.. ‘మోదీని చూసి బీఆర్ అంబేద్కర్ సంతోషపడుతున్నరు. నా వారసుడు మోదీ అని తృప్తి పడుతున్నరు. మోదీ రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నరు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణవాదులు ఫైర్ అవుతున్నారు.
ఇది దయ్యాలు వేదాలు వల్లించడమేనని అంటున్నారు. బీజేపీ తన స్వార్థ రాజకీయం కోసం మహారాష్ట్రలో ప్రజా ప్రభుత్వాన్ని అస్థిర పరుస్తున్నదని గుర్తు చేస్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని పాటించడమా? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమా? అని బండిని నిలదీస్తున్నారు. బీజేపీ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదని, దాదాపు ఆరుసార్లు ఇలాగే ప్రజా ప్రభుత్వాలను కూలదోసిందని గుర్తు చేస్తున్నారు. రాష్ర్టాల హక్కులను హరించడం, తన మాట వినని రాష్ర్టాలపై కక్ష పెంచుకొని అభివృద్ధికి అడ్డుగా నిలవడం, ప్రతిపక్ష నేతలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం, కేసులు, విచారణల పేరుతో అవమానించడం.. ఇవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయా? అంటూ బండి సంజయ్ని ప్రశ్నిస్తున్నారు.