మానకొండూర్, జూన్ 1: మానకొండూర్ చెరువు శిఖం భూమిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అనుచరుడికి కన్నుపడింది. ఆ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలని తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించాడు. దీనికి బండి సంజయ్ అండదండలు పుష్కలంగా ఉండటంతో.. ఇక కబ్జాకు ఏ మాత్రమూ వెనుకాడకుండా ఆ స్థలంలో ట్రాక్టర్లతో చదును చేయిస్తున్నాడు. దీన్ని గమనించిన స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో సదరు నేత భూ కబ్జా వ్యవహారం బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్ మర్రి భావన భర్త, బీజేవైఎం జిల్లా నాయకుడు మర్రి సతీశ్ గురువారం అనుచరులతో కలిసి చెరువు శిఖం భూమిని ట్రాక్టర్లతో చదును చేయిస్తున్నాడు.
విషయం తెలుసుకున్న గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్య సహకార సంఘం నాయకులు చెరువు దగ్గరికి వెళ్లి పనులను అడ్డుకున్నారు. వారికి తప్పుడు పత్రాలు చూపి భయపెట్టాడు. వారు వెనక్కి తగ్గకుండా ఆందోళన తీవ్రతరం చేశారు. సమాచారం అందుకున్న మానకొండూర్ సీఐ రాజ్కుమార్, తహసీల్దార్ లక్ష్మారెడ్డి అక్కడికి చేరుకొని సతీశ్ వద్ద ఉన్న పత్రాలు, ఆయన తీసుకొచ్చిన కోర్టు ఆర్డర్ను పరిశీలించారు.
గతంలో రెవెన్యూ అధికారులు ఈ భూమికి సంబంధించి ఎలాంటి సర్వే చేసి హద్దులు చూపించలేదని నిర్ధారించారు. చెరువు శిఖం భూమిలో ప్రస్తుతం పంట ఉన్నట్టు కబ్జాదారులు కోర్టు నుంచి తీసుకొచ్చిన ఆర్డర్ కాపీలో ఉందని, కానీ.. ఆ భూమిలో ఇప్పుడు ఎలాంటి పంట లేదని ఏవో శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ లక్ష్మారెడ్డి ధ్రువీకరించారు. ఈ నెల 16 వరకు వివాదాస్పదమైన చెరువు శిఖం భూమిలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని తహసీల్దార్ సూచించడంతో సతీశ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అండ చూసుకొనే సతీశ్ భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు.