హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఏమిచ్చిందో ప్రధానమంత్రి మోదీ క్లారిటీ ఇస్తే బాగుండేదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అంబానీ, అదానీలు మోదీ కుటుంబ సభ్యులని ఎద్దేవాచేశారు. అంబానీ, అదానీ, బీజేపీని తరిమికొడితేనే దేశానికి ముక్తి, విముక్తి అని పేర్కొన్నారు.
తెలంగాణకోసం ఇప్పటిదాకా పోరాడామని.. ఇప్పుడు దేశం కోసం పోరాడుతామని తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ది కుటుంబ పాలన కానే కాదని, ఆయన కుటుంబమంతా తెలంగాణకోసం ఉద్యమించి జైళ్లపాలైందని, త్యాగాలు చేసిందని గుర్తుచేశారు. తెలంగాణకు కేంద్ర అడుగడుగునా అన్యాయం చేస్తున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
మోదీ వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగ్గట్టు లేవని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంటులో కించపరిచారని, తెలంగాణ ప్రజలను నూకలు తినుమని అవమానపరిచారని, తెలంగాణకు నయా పైసా ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. మోదీ ఇవ్వాళ వచ్చి.. తెలంగాణపై కపట ప్రేమ చూపిస్తే ఎవరూ నమ్మబోరని స్పష్టంచేశారు. ప్రస్తుతం బీజేపీ ముక్త్ భారత్ కావాలని ఆకాంక్షించారు.
రాష్ట్రాలను బలహీనం చేసి, కేంద్రం బలపడుతున్నదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఇప్పటిదాకా మోదీ చేసిందేమిటో చెప్పాలని నిలదీశారు. తెలంగాణపై వివక్ష, విషం చిమ్మడం, విద్వేషంతో మాట్లాడటమే మీ పనా? అన్నారు. అయితే మతం.. లేకుంటే ప్రాంతాల పేరుతో ప్రజల్లో చిచ్చు పెడుతున్నారని దయాకర్రావు పేర్కొన్నారు.