హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ‘అసలే బండి సంజయ్.. ఆపై మోదీ భుజం కూడా తట్టాడు.. ఇంకేమున్నది.. అప్పటి నుంచి బండిని ఆప వశం అయితలేదు.. ఇప్పటికే సీనియర్లను పూచికపుల్లలాగా తీసిపారేస్తున్నాడు.. ఇక కొత్తగా పార్టీలో చేరినవారినైతే దగ్గరికి కూడా రానిస్తలేడు’.. ఇదీ ఇప్పుడు బీజేపీలో సాగుతున్న చర్చ. పార్టీలో ఏ ఇద్దరు కలిసినా ఇదే ముచ్చట.
హైదరాబాద్లో నిర్వహించిన సభలో మోదీ తన భుజం తట్టినప్పటి నుంచి బండి సంజయ్ కాలు నేలమీద ఆనటంలేదని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. బండి సంజయ్ నియంతృత్వ పోకడ పెరిగిపోతున్నదని రగిలిపోతున్న సీనియర్లను పరేడ్గ్రౌండ్ ఘటన మరింత పరేషాన్లో పడేసింది. ‘సీనియర్లనే పక్కనపెట్టిన. కొత్తగా వచ్చినవారు నాకో లెక్కనా!’ అని సన్నిహితులతో బండి సంజయ్ అన్నట్టు బీజేపీలో ప్రచారం జరుగుతున్నది. దీంతో ఇటీవల పార్టీలో చేరినవారు మళ్లీ కొత్త దారులు వెదుక్కొనే పనిలో పడ్డట్టు సమాచారం.
టార్గెట్ ఆ ముగ్గురు
కొంతకాలం క్రితం బీజేపీలో చేరి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరితోపాటు, ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన ఓ నేతను బండి సంజయ్ టార్గెట్గా చేసుకొన్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకొంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ ఎమ్మెల్యేలు ఇద్దరిని ఎలాగైనా బయటికి పంపాలనే పక్కా ప్రణాళికతో ఉన్నట్టు చెప్తున్నారు. ‘కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నరు. ఎట్లనన్న ఆయన మల్ల ఎంపిగనే పోటీ చేస్తరు.
ఇక లక్ష్మణన్న యూపీకి బోయిండు. ఈటల.. గీటల జాన్తానై’ అని తన సన్నిహితులతో బండి సంజయ్ కామెంట్ చేసినట్టు సమాచారం. ఈ నేతలపై బండి సంజయ్ మొదటినుంచే పార్టీ హైకమాండ్కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తమకు తెలుసు కానీ.. తనకు పోటీ అవుతారని అనుకొంటే మరీ ఇలా వ్యవహరిస్తాడని అనుకోలేదని బండి వ్యతిరేక వర్గం నేత ఒకరు అన్నారు. ‘బండి సంజయ్ బయటికి చూస్తే ఏమీ ఎరుగనట్టు కనిపిస్తాడు.. కానీ మస్తు డేంజర్’ అని ఆయనను దగ్గరగా చూసిన వ్యక్తి వ్యాఖ్యానించారు.
‘ఈటల, రఘు ఎన్నడైనా పార్టీ నుంచి పోయేవాళ్లే’ అని పార్టీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్చుగ్ ద్వారా పదేపదే పార్టీ పెద్దలకు చెప్పిస్తున్నారని, అందులో భాగంగానే అమిత్షా ‘ ఆ ఇద్దరి వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచండి’ అని ఇటీవల హుకుం జారీ చేసినట్టు తెలిసింది. మరోవైపు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న నేతపై కూడా బండికి ఇదే వైఖరి ఉన్నదని సమాచారం. ‘నియోజకవర్గంలో ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది’ అని పార్టీ పెద్దలకు సమాచారం ఇచ్చినట్టు అరుణ చెవిలో పడి బండిపై ఆమె గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది.
కింకర్తవ్యం..?
బండి సంజయ్ నియంతృత్వ పోకడ, పొమ్మనలేక పొగపెడుతున్న వైనంపై పార్టీలో సీనియర్లు, జూనియర్లు అన్నతేడా లేకుండా ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. ఈటల రాజేందర్, రఘునందన్రావు, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి లాంటి నాయకులే కాకుండా పార్టీలో చేరిన నియోజకవర్గ స్థాయినాయకులు అనేక మంది ‘ఇక్కడుంటే లాభం లేదు. పార్టీకి తామెంత విశ్వసనీయులుగా ఉన్నా బండి మాపై తొండి చేస్తున్నాడు. మమ్మల్ని ఎలాగైనా బయటికి వెళ్లగొట్టాలనే కక్షగట్టి ఉన్నాడు’ అనే నిర్దారణకు వచ్చినట్టు చెప్పుకొంటున్నారు. దీంతో చాలామంది తమ భవిష్యత్ కార్యాచరణపై సమాలోచన చేస్తున్నట్టు తెలిసింది.
సీనియర్లకు సెగ.. జూనియర్లకు పొగ
పార్టీ హై కమాండ్ దగ్గర సీనియర్లకు పతార లేకుండా చేయటం.. ఇటీవల పార్టీలో చేరినా తన దారికిరానివారిపై కత్తికట్టడం అనే ద్విముఖ వ్యూహాన్ని ఏకకాలంలో బండి సంజయ్ అనుసరిస్తున్నారని పార్టీ నేతలు బాహాటంగానే చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలుకొని రాష్ట్రం వచ్చేవరకు కిషన్రెడ్డి, లక్ష్మణ్ లాంటి వాళ్లు పార్టీకి నాయకత్వం వహించినా ఏనాడూ బీజేపీకి ఇంత జోష్ రాలేదని, అది తన వల్లే సాధ్యమయ్యిందని స్వయంగా అమిత్షా, మోదీకి తెలిసిపోయిందని సంజయ్ చెప్పుకొంటున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న బండి సంజయ్కి పరేడ్గ్రౌండ్ ఎపిసోడ్ నుంచి పట్టపగ్గాలు లేకుండాపోయాయని సీనియర్లు కుతకుత ఉడుకుతున్నారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లు లేరు.. తెలంగాణలో బీజేపీ అంటే బండి సంజయ్ మాత్రమే అన్నట్టుగా వ్యవహరిస్తునారని లోలోన మండిపడుతున్నట్టు సమాచారం.