Vijaya shanthi | హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి త్వరలో పార్టీ మారబోతున్నారా? ఇప్పుడు రాష్ట్రమంతటా ఇదే చర్చ మొదలైంది. బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదంటూ ఇప్పటికే ఆమె తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన ‘రాములమ్మ’.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిర్వహించిన ధర్నాల్లోనూ పాల్గొనలేదు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమారెడ్డితో వేదికను పంచుకోలేకనే కిషన్రెడ్డి ప్రమాణ స్వీకారం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయానని ప్రకటించారు. వాస్తవానికి ఇలాంటి ప్రకటనలు చేసినప్పుడు తప్ప బీజేపీలో విజయశాంతి గురించి పట్టించుకున్న నాథుడే లేడు. మునుగోడు ఎన్నికల సమయంలో బీజేపీ తన సేవలను వినియోగించుకోవడం లేదంటూ విజయశాంతి మీడియా ముందే వాపోవడంతో రెండుమూడు రోజులు ఆ హడావుడి కనిపించింది.
ఆ తర్వాత తనకు బాధ్యతలు ఎందుకు అప్పగించడంలేదో బండినే అడగాలంటూ మండిపడ్డారు. ఇలా అసంతృప్తిని మీడియా ముందు వెళ్లగక్కినప్పుడు తప్ప విజయశాంతికి బీజేపీలో గుర్తింపు ఉండటం లేదు. దీంతో చాలా రోజులుగా ఆమె సోషల్ మీడియా పోస్టులకే పరిమితమయ్యారు. సినీనటిగా, ఒకప్పుడు సొంతంగా పార్టీని స్థాపించిన నేతగా, సీనియర్ నాయకురాలిగా పలుకుబడి ఉన్న తనను బీజేపీ నాయకత్వం పట్టించుకోకపోవడంపై ‘రాములమ్మ’ తీవ్రంగా కలత చెందుతున్నట్టు సన్నిహితులు చెప్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అనేకమంది నేతలకు టికెట్లపై హామీలు ఇచ్చారని, మరికొందరికి కీలక బాధ్యతలు అప్పగించారని, తనను మాత్రం విస్మరించారని ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తున్నది. కొత్తగా కమిటీల మీద కమిటీలు వేస్తున్నా తనకు ఎక్కడా స్థానం కల్పించకపోవడంపైనా మండిపడుతున్నట్టు సమాచారం. ఇది ఇలాగే కొనసాగితే బీజేపీని వీడాలని విజయశాంతి నిర్ణయించుకున్నట్టు ఆమె సన్నిహితులు చెప్తున్నారు.