రంగారెడ్డి జిల్లా, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని కేవీఆర్ గ్రౌండ్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్న విజయ సంకల్ప సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సభకు పెద్ద ఎత్తున జనాన్ని తీసుకువచ్చేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు సభ వేదిక వద్దకు వచ్చిన జేపీ నడ్డా.. ఖాళీ కుర్చీలను చూస్తూనే ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేకుండా ఎప్పటిలాగే తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలతో సరిపెట్టారు. అయినా జనం నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. వచ్చిన వారు కూడా సభ అయిపోయే వరకు ఉండకుండా మధ్యలోనే వెళ్లిపోయారు. నడ్డా ప్రసంగంలో పస లేకపోండం, ఏదో చెబుతారనుకుంటే ఏమి చెప్పకుండా ప్రసంగాన్ని ముగించారని అక్కడున్న నేతలే గొనుక్కున్నారు.