సూర్యాపేట, జనవరి 21(నమస్తేతెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నదని, జాతీయ వాదంలో వారి డొల్లతనం కనిపిస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో శుక్రవారం రెండోరోజూ ఇంటింటికీ వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గణతంత్ర వేడుకల్లో శకటాల ఎంపికపై కేంద్రం చూపించిన వివక్షపై మండిపడ్డారు. నేడు అన్ని రాష్ర్టాలు సమానంగా అభివృద్ధి చెందేలా కేంద్రం పాలన సాగించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ర్టాలపై జరుగుతున్న వివక్షను ప్రజలు గమనిస్తున్నారని.. బీజేపీ చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటిలా ఉన్నదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు.