రాజన్న సిరిసిల్లా : సామాన్యులు ఎదుర్కొనే సమస్యలపై స్పందించని బీజేపీ నాయకులు మత రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా మండలి(Planning Board) వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధిపై కాకుండా అరాచకాల వైపే బీజేపీ దృష్టిని సారిస్తుందని మండిపడ్డారు.
ప్రజలకిచ్చిన హామీలను పరిష్కరించారని, ఆసరా పింఛన్లను సీఎం కేసీఆర్(CM KCR) గణనీయంగా పెంచారని వెల్లడించారు. ఎంపీగా తాను రాజేశ్వర్రావు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించానని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా రాష్ట్రంలో అనేక మార్పులు వస్తున్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi) అభివృద్ధి గురించి కాకుండా కుటుంబం గురించి మాట్లాడుతుండడం దురదృష్టకరమని అన్నారు.
బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించాలని బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు సూచించారు. పుల్వామ దాడి మోదీ వైఫల్యమేనని అన్నారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే రమేశ్బాబు తదితరులు పాల్గొన్నారు.