హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): సాయుధ రైతాంగ పోరాటయోధులకు స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్లు రాకుండా అడ్డుకొని, ఆ త్యాగధనులను దేశద్రోహులుగా చిత్రీకరించిన బీజేపీకి తెలంగాణ గడ్డ మీద ఉత్సవాలు చేసే హక్కులేదని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సెప్టెంబర్ 17తో బీజేపీకి ఏమి సంబంధమని నిలదీస్తున్నారు. కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులకు పింఛన్లు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి, సీపీఐ నేత ఇంద్రజిత్ గుప్తా సాయుధ పోరాటంలో పాల్గొన్నవారికి, మరణించిన కుటుంబాలకు దేశ స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ ఇచ్చేందుకు ప్రయత్నించారు.
హైదరాబాద్ స్పెషల్ స్క్రీనింగ్ కమిటీ (హెచ్ఎస్ఎస్సీ) చైర్మన్గా వ్యవహరించిన చెన్నమనేని రాజేశ్వర్రావు నాటి పోరాటయోధుల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. వాటిని పరిశీలించిన ఇంద్రజిత్గుప్తా తొలి విడతగా కొంతమందికి పింఛన్లు మంజూరు చేశారు. ఈ ప్రక్రియను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ‘దేశద్రోహులకు సమరయోధుల పింఛన్లా..?’ అంటూ కరపత్రాలు పంపిణీ చేసింది. ఈ ప్రచారానికి అప్పుటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ విద్యాసాగర్రావు నేతృత్వం వహించారు.
వాళ్లు సమరయోధులు కాదని, అదంతా బోగస్ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి హోదాలో సీహెచ్ విద్యాసాగర్రావు 29 జూన్ 1998లో ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. యునైటెడ్ ఫ్రంట్ తరువాత అధికారంలోకి వచ్చిన వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ ఫైళ్లను అటకెక్కించింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఏ ఒక్కరోజూ పోరాటయోధుల యోగక్షేమాలను పట్టించుకోని బీజేపీ.. ఉన్నఫళంగా సెప్టెంబర్ 17న ఉత్సవాలు నిర్వహించటం ఏమిటని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
బీజేపీకి చరిత్ర తెలియదని ఫార్వర్డ్బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్విబండ సురేందర్రెడ్డి ఎద్దేవా చేశారు. 1948 నుంచి 1956 వరకు రాజ్ప్రముఖ్ హోదాలో నిజాం.. ప్రభుత్వాధినేతగా వ్యవహరించారని చెప్పారు. నిజాం రాజ్ప్రముఖ్గా 1956 వరకు నిజాం ఏలుబడిలోనే ఈ ప్రాంతం కొనసాగిందన్నారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం నుంచి విమోచనమైనట్టు బీజేపీ ఎలా చెప్తుందని నిలదీశారు. చరిత్ర తెలియని గవర్నర్ సెప్టెంబర్ 17ను విమోచనదినంగా జరుపుకోవాలని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.
విమోచన, విలీనం, విద్రోహం అనే మీమాంసకు తావులేకుండా ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని నిర్ణయిస్తే.. భిన్నాభిప్రాయం వ్యక్తంచేసిన తమిళిసై.. గవర్నర్గా కొనసాగే అర్హతను కోల్పోయారని తేల్చిచెప్పారు. ఏ రాష్ట్రంలోనూ విమోచన ఉత్సవాలను నిర్వహించని మోదీ ప్రభుత్వం తెలంగాణలో ఏమి సాధిస్తుందని నిప్పులు చెరిగారు. చరిత్రను వక్రీకరించి తెలంగాణలో అలజడి సృష్టించేందుకు బీజేపీ కుటిల యత్నం చేస్తున్నదని మండిపడ్డారు.