పూటకోమాట, రోజుకో వైఖరి! రాష్ట్రంలోని బీజేపీ నేతలు యాసంగిలో వరే పండించండి, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కొనిపిస్తమని రైతులను రెచ్చగొడుతరు. అసలు సంగతేందని ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిస్తే.. యాసంగి బియ్యం కొనే ప్రసక్తే లేదని ఆయన తేల్చేస్తరు. తామూ రాజకీయం చేస్తమని ఖుల్లంఖుల్లా చెప్తరు. ఆ భేటీ ముగిసిన కాసేపటికి.. తెలంగాణలో యథాతథంగా ధాన్యం సేకరణ అంటూ పీఐబీ లీకులిస్తది! ఇంతకీ యాసంగిలో వరి వేయాలా? వద్దా? వేస్తే పీఐబీ లీకుల ప్రకారం.. కొంటరా? లేక కేంద్రమంత్రి మాటల ప్రకారం కొనరా? వేటికీ సమాధానాలు లేవు! ఎందుకంటే ఇది బీజేపీ సర్కార్ డేంజరస్ పొలిటికల్ గేమ్!!
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణపై శుక్రవారం ఢిల్లీలో జరిగిన పరిణామాలు రాష్ట్ర రైతాంగాన్ని మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి. తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. తనతో సమావేశమైన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, అధికారుల బృందంతో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖల మంత్రి పీయూష్ గోయల్.. ‘నేనూ రాజకీయ నాయకుడినే. మాకూ రాజకీయ ప్రయోజనాలుంటాయి. మేం ఏం చేయాలో అదే చేస్తాం. మీరు ఏది అడిగితే అది చేయాల్సిన అవసరం లేదు’ అని అనటం ఆ పార్టీ స్వార్థ రాజకీయ చింతనను తేటతెల్లం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని పరిస్థితులు, అన్నదాతలు కుదుటపడుతున్న తీరును కూలంకషంగా వివరించిన రాష్ట్ర మంత్రులు.. యాసంగి కొనుగోళ్లపై స్పష్టత కోరితే.. ససేమిరా అన్న కేంద్రమంత్రి.. కనీసం టార్గెట్ చెప్పేందుకు కూడా నిరాకరించారు. దాంతో రాష్ట్రమంత్రులు నిరాశతో వెనుదిరిగారు. కానీ.. కొంతసేపటికి పీఐబీ నుంచి ‘తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు యథాతథంగా కొనసాగుతాయి’ అన్న ఏక వాక్య వార్తను లీక్ చేయించడం మరింత గందరగోళం సృష్టించింది. ఇది రైతన్నలతో ఆటాడుకోవడమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత ఏడేండ్లలో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కష్టాలు తీర్చి గట్టున పడేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడిప్పుడే రైతులు నిశ్చింతగా బతికే పరిస్థితులు వస్తున్నాయి. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి అన్నదాతకు అశనిపాతంగా మారింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న జనాదరణను చెడగొట్టేందుకు ప్రమాదకర రాజకీయ కుతంత్రాలు పన్నుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం సేకరణను సమస్యగా మార్చటం ఈ కుట్రలో భాగమేనని అంటున్నారు.
రైతుల బాధలను తీర్చేందుకు సీఎం కేసీఆర్, రాష్ట్ర మం త్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కాళ్లరిగేలా తిరిగినా కేం ద్రం కనికరించడం లేదు. తెలంగాణలో యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే ఉత్పత్తి అవుతాయని, రా రైస్ సాధ్యం కాదని రా ష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మొరపెట్టుకొంటున్నది. మొండివైఖరితో రైతులకు నష్టం చేయొద్దని కోరుతున్నది. అధికారులు మూడుదఫాలుగా ఢిల్లీ వెళ్లి కేంద్రంతో చర్చలు జరిపి వాస్తవ పరిస్థితిని వివరించారు. సీఎం కేసీఆర్ కూడా రెండు దఫాలుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రికి పరిస్థితిని తెలిపారు. కేంద్రం మాత్రం బాయిల్డ్ రైస్ విషయంలో రాజకీయాలు చేస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు.