Renu Desai | సోషల్ మీడియాలో ట్రోలింగ్, అసభ్యకర వ్యాఖ్యలపై టాలీవుడ్ సీనియర్ నటి రేణు దేశాయ్ కఠినంగా స్పందించారు. తనపై నిరంతరం దూషణలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న కొందరిపై ఆమె సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఉన్న వారి అకౌంట్లను ట్రేస్ చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇటీవల రేణు దేశాయ్ వీధికుక్కల సమస్యపై ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఆమెను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఈ వ్యాఖ్యలు రోజురోజుకు తీవ్రతరం కావడంతో రేణు దేశాయ్ మొదట వారిని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రవర్తించొద్దని వార్నింగ్ ఇచ్చినా కూడా వారు తమ ప్రవర్తన మార్చుకోలేదు.
దీంతో చివరకు రేణు దేశాయ్ సైబరాబాద్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డిజిటల్ ఫోరెన్సిక్ సాయంతో సోషల్ మీడియాలో ఉపయోగించిన అకౌంట్ల వివరాలను సేకరించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఇటీవల సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, అసభ్యకర వ్యాఖ్యలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఇటువంటి కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇదే సమయంలో ప్రముఖ యాంకర్ అనసూయ కూడా తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న కొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో కూడా ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ సంఘటనల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించి ఎవరినైనా దూషించవచ్చని భావించే వారికి ఇది ఒక హెచ్చరికగా నిలుస్తోంది. నోటికి వచ్చినట్లు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే తప్పకుండా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.