తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం
ఖైరతాబాద్, అక్టోబర్ 10: దళితబంధు పథకం ప్రవేశపెట్టిన ఏకైక సీఎం కేసీఆర్కు దళితులు రుణపడి ఉంటారని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్లోని లక్డీకాపూల్లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు దళితబంధులాంటి పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. హుజూరాబాద్లో బీజేపీ గెలిస్తే ఉత్తరప్రదేశ్లో మాదిరిగానే దళితులపై దాడులు, లైంగికదాడులు, హత్యలు చేస్తారని పేర్కొన్నారు. దళిత వ్యతిరేక పార్టీ బీజేపీని హుజూరాబాద్లో ఓడించి తీరుతామని చెప్పారు. ఈ నెల 12 నుంచి హుజురాబాద్తోపాటు అన్ని జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద బీజేపీకి వ్యతిరేకంగా దళితులతో తీర్మానాలు చేయిస్తామని పేర్కొన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా దళితులకు 22, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచాలని కోరారు. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుస్తామని చెప్పారు. బీసీలు కూడా హిందువులేనని, బీసీ జనగణన ఎందుకు చెప్పట్లేదని నిలదీశారు.