శివాజీని హిందూ పక్షపాత చక్రవర్తిగా చిత్రిస్తున్నది
ధర్పల్లిలో రాళ్లదాడి చేయించిన ఎంపీ అర్వింద్
మీడియాతో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
హైదరాబాద్, ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా బీజేపీ అజ్ఞానంతో ముస్లిం వ్యతిరేక హిందూ పక్షపాత చక్రవర్తిగా చిత్రీకరిస్తున్నదని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఉన్న నలుగురైదుగురు బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రజాసేవపై శ్రద్ధ చూపకుండా ప్రజల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లోని బస్భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి అన్ని పార్టీల నాయకులు చందాలు ఇచ్చారని చెప్పారు. కానీ, బీజేపీ ఎంపీ అర్వింద్ విగ్రహావిష్కరణ ముసుగులో రాళ్లదాడి చేయించి ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని ప్రజలు ప్రశ్నిస్తుండటంతో, ఏం చేయాలో తెలియక టీఆర్ఎస్ నాయకులపై నిందలువేస్తూ అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ప్రతిపాదనలు
టీఎస్ ఆర్టీసీలో 2,828 కొత్త బస్సుల కొనుగోలుతోపాటు 1,200 కారుణ్య నియామకాల కోసం ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. కార్మికులకు ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని, పీఎఫ్ బకాయిలను సైతం విడుదల చేస్తున్నామని తెలిపారు. రిటైర్ అవుతున్న ఉద్యోగులకు దాదాపు రూ.500 కోట్లు అవసరం అవుతాయని, సీఎం కేసీఆర్తో మాట్లాడి ఆ మొత్తం సర్దుబాటు చేస్తామని చెప్పారు. అందరి సమిష్టి కృషితో సంస్థ క్రమక్రమంగా పూర్వ వైభవం దిశగా పయనిస్తున్నదని బాజిరెడ్డి వెల్లడించారు.