హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు బీజేపీ ప్రయత్నాల అభియోగాలపై మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన చేసిన కేసులో దర్యాప్తును వాయిదా వేయాలని శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. రిమాండ్ రిపోర్టులో పంచనామా ఈ నెల 26న జరిగినట్టుగా ఉందని, అందులో మధ్యవర్తుల సంతకాలు 27న చేసినట్టుగా ఉండడం దర్యాప్తును వాయిదా వేయాలనే ఉత్తర్వుల జారీకి కారణమని స్పష్టం చేశారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేశారు. కాగా నిందితులకు సంబంధం లేని బీజేపీకి చెందిన వ్యక్తి రిట్ దాఖలు చేసేందుకు అర్హత లేదని అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు గట్టిగా వాదించారు.
కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరితే.. దర్యాప్తునే వాయిదా వేయాలని ఉత్తర్వులు జారీ చేయడంపై తీవ్ర అభ్యంతరం చెప్పారు. పిటిషన్లో ఏవిధమైన మధ్యంతర ఉత్తర్వులు బీజేపీ కోరలేదని గుర్తు చేశారు. ముగ్గురు నిందితులను రిమాండ్కు పంపాలని మరో న్యాయమూర్తి ఉత్తర్వులు కూడా జారీ చేశారని, అందుకు విరుద్ధంగా దర్యాప్తును వాయిదా వేయాలనే ఉత్తర్వులను నిలిపేయాలని కోరారు. దీనిపై పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది జే ప్రభాకర్ కల్పించుకొని, తాము దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని మాత్రమే కోరామని చెప్పారు. వాదనల తర్వాత న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి స్పందిస్తూ, ఆ న్యాయమూర్తి ఉత్తర్వులపై తాము స్పందించబోమని చెప్పారు. అయినా, తాము కేసు దర్యాప్తును నిలిపివేయడం లేదని, కేవలం దర్యాప్తును తదుపరి విచారణ నవంబర్ 4 వరకు వాయిదా వేయాలని మాత్రమే మధ్యంతర ఉత్తర్వలు ఇస్తున్నట్లు చెప్పారు. తిరిగి అదనపు ఏజీ కల్పించుకొని పిటిషనర్కు రిట్ దాఖలు చేసే అర్హతే లేదన్నారు. నిందితులు తమ కేసును ఫలానా దర్యాప్తు సంస్థకు బదలాయించాలని కోరే హక్కు లేదని, ఇలా కోరడం చట్ట వ్యతిరేకమని చెప్పారు. ఇటీవల వరవరరావు కేసులో సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని చెప్పిందని గుర్తుచేశారు. అదనపు ఏజీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ దర్యాప్తును నవంబర్ 4 వరకు వాయిదా వేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.