MP Arvind | నిజామాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వేల్పూర్: సీఎం రేవంత్రెడ్డి త్వరలో తమ పార్టీలో చేరడం ఖాయమని బీజేపీ ఎంపీ అర్వింద్ మరోమారు స్పష్టం చేశారు. ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రేపోమాపో బీజేపీలో చేరిపోతారని పుకార్లు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే చాలాచోట్ల కాంగ్రెస్ నుంచి డమ్మీ అభ్యర్థులను నిలబెట్టినట్టు తెలుస్తున్నదని చెప్పారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన బీజేవైఎం కార్యకర్తల సమావేశంలో అర్వింద్పై వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కూడా రేవంత్రెడ్డి కాంగ్రెస్ను ఖాళీ చేసి బీజేపీలోకి వస్తారని స్పష్టం చేశారు. పరోక్షంగా రేవంత్రెడ్డి బీజేపీకే మద్దతు పలుకుతున్నారని ప్రకటించారు. అలాంటప్పుడు ఇంతటి ఎండలో ఎన్నికలెందుకని ప్రశ్నించారు.
బీజేపీని నియంత్రించడం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోనే సాధ్యమైందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలం పెరగకుండా కేసీఆర్ మాత్రమే కంట్రోల్ చేశారని, కాంగ్రెస్ వాళ్లు ఎక్కడా బీజేపీని అడ్డుకోలేకపోయారని తెలిపారు. ఎన్నారైల మీద కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డికి ఎక్కడాలేని ప్రేమ పుట్టుకొచ్చిందని, 45 ఏండ్ల రాజకీయ జీవితంలో ఆయన ఒక్కసారి కూడా ఎన్నారైల గురించి మాట్లాడలేదని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నారైల సంక్షేమ బోర్డును పెట్టిస్తానని అంటున్నాడని విమర్శించారు. చక్కెర ఫ్యాక్టరీలు జీవన్రెడ్డి కారణంగానే మూతపడ్డాయని, లోక్సభ ఎన్నికల్లో ఆయన్ను గెలిపిస్తే వాటిని తెరిపిస్తామంటున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్నారైల సంక్షేమ బోర్డు, ఫ్యాక్టరీల పునరుద్ధరణ అంశాలు రాష్ట్ర పరిధిలోనివని, వాటికి లోక్సభ ఎన్నికలతో సంబంధమేంటని ప్రశ్నించారు. జిల్లాకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను తెచ్చి, జక్రాన్పల్లి వద్ద ఎయిర్పోర్టును ఏర్పాటు చేయించి కనీసం పదివేల మంది ఎన్నారైలను వాపస్ తీసుకురాకపోతే తన పేరు మార్చుకుంటానని, ఈసారి ఇదే తన బాండ్ పేపర్ అని అర్వింద్ స్పష్టం చేశారు.