దుబ్బాక, మార్చి 20 : పరీక్షల సమయంలో విద్యార్థులతో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రాజకీయం చేస్తున్నాడంటూ స్థానికంగా విమర్శలు గుప్పుమంటున్నాయి. కొంతకాలం నుంచి ఎమ్మెల్యే రఘునందన్ వైఖరితో విసుగుచెందిన సొంత పార్టీ శ్రేణులు ఆయన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో దుబ్బాకలో బీజేపీ కార్యక్రమాలు కార్యకర్తలలేమితో వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో కళాశాలలకు వెళ్లి విద్యార్థులను బతిమిలాడుకొని కార్యక్రమం నిర్వహించుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని సొంత పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీని నిరసిస్తూ బీజేపీ సోమవారం నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దుబ్బాకలో నిర్వహించిన బీజేపీ నిరసనలో కార్యకర్తలు రాలేదు. దీంతో చేసేదేమిలేక ఎమ్మెల్యే రఘునందన్ అనుచరగణం స్థానికంగా ఉన్న కళాశాలలకు వెళ్లి విద్యార్థులను బతిమిలాడుకొని నిరసన దీక్ష వద్దకు తీసుకొచ్చారు. దీంతో దుబ్బాకలో జరిగిన బీజేపీ నిరసన దీక్షపై విమర్శలు నెలకొన్నాయి. పరీక్షల సమయంలో విద్యార్థులతో రాజకీయం చేస్తున్నరంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. పరీక్ష సమయంలో చదువుకోవాల్సిన విద్యార్థులతో రాజకీయం చేయడమేమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.