హైదరాబాద్ : నగరంలోని గోషామహల్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీస్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ ఓటర్లను బెదిరించారని నోటీస్ ఇచ్చింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. యూపీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం వీడియో విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్లో ఏడు విడుతల్లో ఎన్నికల జరుగుతుండగా.. ఇప్పటికే రెండు విడుతల పోలింగ్ పూర్తయ్యింది.
పలు ప్రాంతాల్లో అత్యధికంగా ఓటింగ్ నమోదైంది. ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయని తెలుస్తుంది. ఈ క్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ‘యూపీలో బీజేపీకి, యోగికి ఓటు వేయనివారిని గుర్తించి, వాళ్ల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తామంటూ’ హెచ్చరించారు. ‘ఉత్తరప్రదేశ్లో ఉండాలనుకున్నారా? లేదా? బిడ్డా.. యోగి అధికారంలోకి రాకపోతే మీరంతా యూపీని వదిలి పారిపోవాలి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసిందని.. మూడో విడత పోలింగ్లో కచ్చితంగా హిందువులంతా ఏకమై యోగి ఆదిత్యనాథ్కు ఓటు వేయాలి’ అని, ‘ఎన్నికల్లో యోగికి ఓటు వేయనివారంతా ద్రోహులు’ అన్నారు. ‘వారికి ఉత్తర ప్రదేశ్లో స్థానం లేదు’.. యోగికి ఓటు వేయని వారిని తరిమి తరిమి కొడతాం’ అంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు పలు జాతీయ చానెళ్లలో ప్రసారం కాగా.. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాజాసింగ్కు నోటీసులు జారీ చేసింది.