హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓటమి భయంతోనే రెండుచోట్ల పోటీ చేస్తానని ప్రకటించారా? అని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. గత నెల 21న 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సీఎం కేసీఆర్.. తాను గజ్వేల్తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. దీనిపై ఈటల రాజేందర్ స్పందిస్తూ.. ‘ప్రజాదరణ ఉన్నవారు, అప్రతిహతంగా గెలిచేవారు అయితే సీఎం కేసీఆర్ రెండు సీట్లలో ఎందుకు పోటీ చేస్తున్నారో చెప్పాలి. ఇది చాలదా కేసీఆర్ భయం తెలవడానికి’ అని వ్యాఖ్యానించారు. నాడు ఈటల రాజేందర్ అన్న ఈ మాటలను గుర్తుచేస్తూ.. హుజూరాబాద్లో ఓడిపోతానన్న భయంతోనే రెండు సీట్లలో పోటీ చేస్తున్నారా? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
హుజూరాబాద్ ప్రజలను నమ్మించి మోసం చేయడానికే ఈటల రెండు సీట్లలో పోటీ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎవరికి వారే టికెట్లు ప్రకటించుకునే సంప్రదాయం బీజేపీలో లేదని, అభ్యర్థులు ఎవరో సెంట్రల్ కమిటీ నిర్ణయిస్తుందంటూ ఆ పార్టీ ప్రస్తుత, మాజీ అధ్యక్షులు కిషన్రెడ్డి, బండి సంజయ్ పలుమార్లు చెప్పిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఈటల రెండుచోట్ల పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించుకోవడం ఏమిటి? టికెట్ కోసం రెండుచోట్ల దరఖాస్తు చేసుకున్నారా? అలాకాకుండా ఈటల సొంతంగా ప్రకటించుకుని ఉంటే ఈ మాత్రం దానికి దరఖాస్తుల స్వీకరణకు ఒక కమిటీ, పరిశీలనకు ఒక కమిటీ, స్టీరింగ్ కమిటీ.. ఇలాంటి ప్రహసనం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు.