హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ప్రజలను మభ్యపెట్టేందుకు బీజేపీ దొంగ ప్రమాణాలు చేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారో చెప్తూ ‘ప్రమాణ పత్రం’ పేరుతో ఆ పార్టీ నేతలు ఒక అబద్ధాల మ్యానిఫెస్టోను విడుదలచేశారు. దీనిని పరిశీలిస్తే.. ప్రజలను మాయ చేసేందుకు తూతూ మంత్రంగా నాలుగు మాటలు చెప్పడం తప్ప, వారి పట్ల నిబద్ధత ఎక్కడా కనిపించదు. బీజేపీ ఇచ్చిన కొన్ని మోసపు హామీలు..
1.వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇప్పిస్తాం.
మద్దతు ధర సరిపోవడం లేదని రైతులు చెప్తున్నారు. మరి దానిని పెంచుతామని ఎందుకు చెప్పలేదు. ధాన్యాన్ని ఎఫ్సీఐ కొనుగోలు చేసేలా ఒత్తిడి తెస్తామని హామీ ఇవ్వగలరా?
2.ఆయుష్మాన్ భారత్ అమలు చేయిస్తాం.
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ను అమలు చేస్తున్నట్టు ఈ ఏడాది మేలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ పథకం కన్నా మెరుగైన ఆరోగ్యశ్రీ కూడా అమలవుతున్నది. మరి కొత్తగా బీజేపీ అమలు చేసేదేంటో అర్థం కాదు.
3.వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు,అనాథలను ఆదుకుంటాం.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయా వర్గాలకు అండగా నిలుస్తున్నది. ముఖ్యంగా దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఒంటరి మహిళలకు పెన్షన్ అందిస్తున్నది. అనాథలను ఆదుకునేందుకు మెరుగైన విధానాన్ని రూపొందించేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే క్యాబినెట్ సబ్కమిటీని నియమించారు.
4.అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సమర్థంగా అమలయ్యేలా చూస్తాం.
రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10 శాతం అమలుచేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉత్తర్వులు జారీచేసింది. మార్గదర్శకాలను సైతం విడుదలచేసి, విజయవంతంగా అమలు కూడా చేస్తున్నది.
5.నియోజకవర్గంలోని పట్టణాలు, మండలాలు, గ్రామాలన్నింటికీ రక్షిత మంచినీరు ఇస్తాం.
మిషన్ భగీరథ కింద రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సురక్షిత మం చినీరు సరఫరా అవుతున్నది. కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని చెప్పింది. అయినా బీజేపీ నేతల కండ్లకు కనిపించ డం లేదు. కేంద్రం ప్రశంసలు వినిపించడం లేదు.
6.అనేక పథకాల కింద నియోజకవర్గానికి నిధులు తెస్తాం.
రాష్ర్టానికి అదనంగా కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలి. పోనీ.. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న గోషామహల్, దుబ్బాకలకు పారిన నిధులు ఎన్ని? బీజేపీ ఎంపీలున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు ఎన్ని నిధులు తెచ్చారు?
7.దళితులపై ప్రేమేదీ?
హుజూరాబాద్ మ్యానిఫెస్టోలో బీజేపీ ఎక్కడా దళితులను ప్రస్తావించలేదు. దళితబంధును నిలిపివేసి.. దొంగే దొంగా..దొంగా అని అరిచినట్టు బీజేపీ వ్యవహరిస్తున్నదని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఒకవేళ వారు నిలిపివేయించకపోతే దళితబంధు గురించి ఎందుకు ప్రస్తావించలేదు?. వారి అభ్యున్నతికి ఏం చేస్తారో ఎందుకు చెప్పలేదు.