Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన ప్రకటనలు మరిచిపోయి గజినీలా ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అమలు చేయలేదని, ఇప్పుడు కొత్తగా మళ్లీ హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఓటమి భయంతో రేవంత్ రెడ్డికి రైతులమీద ప్రేమ పుట్టుకొచ్చిందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటకు బోనస్ ఇవ్వాలంటే రూ.11 వేల కోట్లకుపైగా అవసరమని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రూ.19,756 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లను దండుకునేందుకే ఆగస్టు 15 నాటికి రుణమాఫీ అంటూ కొత్త నాటకం మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్లలో ఎన్నింటిని అమలు చేశారో చెప్పాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఇంకా పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రిగా బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు. బీజేపీ అధికార ప్రతినిధి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయలేక బీజేపీపై బురద చల్లుతున్నదని మండిపడ్డారు. పొన్నం ప్రభాకర్ కల్లు తాగిన కోతి మాదిరిగా శ్రుతి మించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పొన్నం 2009లో రాజశేఖర్ రెడ్డి భిక్షతో గెలిచి, తర్వాత అదే కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టారన్నారు. ప్రధాని మోదీ మళ్లీ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తావా? అని సవాలు విసిరారు. నాలుగు నెలలు కాలంలో బీసీలకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.