Maheshwar Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఇప్పుడు ఎల్లో కాంగ్రెస్, గ్రీన్ కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్ అనే మూడు గ్రూపులుగా విడిపోయిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో ఇప్పుడు ఐదుగురు షిండేలు ఉన్నారని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి కోసం పదిమంది పోటీపడుతున్నారని తెలిపారు. రెండోస్థానం కోసం కూడా పోటీ తీవ్రంగా ఉన్నదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారని, వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని, తెరవెనుక కుట్రలు జరుగుతున్నాయని మహబూబ్నగర్ సభలో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అలా అనడం ఆయన అసమర్థతకు నిదర్శనమని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్లో రేవంత్రెడ్డి సౌకర్యంగా లేరని, అందుకనే సొంత దుకాణం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే తనవెంట ఉన్న ఎమ్మెల్యేలకు తోడుగా బీఆర్ఎస్ నుంచి మరో 25 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
రేవంత్కు పోటీగా 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఉత్తమ్ కామెంట్ చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ను ఎవరూ ఏమీ చేయాల్సిన అవసరం లేదని, నాయకుల మధ్య విభేదాలే పార్టీని బలహీనం చేస్తాయని విమర్శించారు. వాళ్లలో వారే కొట్టుకోవడం ద్వారా ప్రభుత్వం కూలిపోతుందని పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఖాయమైందని, కాబట్టి ఆయన సోదరుడు వెంకట్రెడ్డిని పదవి నుంచి తప్పించి దానిని ఆయనకు ఇస్తారేమోనని అనుమానం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ గేట్లు తెరిచినా, కిటికీలు తెరిచినా బీజేపీ నుంచి ఎవరూ వెళ్లరని తేల్చిచెప్పారు. తాము ప్రజలను నమ్ముకున్నామని, కాబట్టి గేట్లు ఎత్తాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బీ ట్యాక్స్ అంటే భట్టి ట్యాక్స్ అని కాంగ్రెస్ నేతలే లీకులు ఇస్తున్నారని మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.