ఆదిలాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నమ్మకద్రోహానికి పాల్పడుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాలోని బేలలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే రామన్న సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో సీసీఐని సందర్శించిన కేంద్ర మంత్రులు సిమెంట్ పరిశ్రమ ప్రారంభిస్తామని చెప్పినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు.
సీసీఐ ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పినా కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని విమర్శించారు. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో మూడు నెలలుగా ఆందోళనలు జరుగుతున్నా బీజేపీ సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ప్రభుత్వ పరిశ్రమలు అమ్మకానికి పెడుతున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. టీఆర్ఎస్ పార్టీలోనే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.