హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో షిండే మాడల్ రాజకీయాలు చేద్దామంటూ బీజేపీ సన్నిహితులు కొందరు తనతో ప్రతిపాదించారని, దాన్ని తాను నిర్ద్వంద్వంగా తిరస్కరించానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. సొంతబలంపైనే తాము నాయకులుగా నిలబడుతామని, అడ్డదారిలో కాదని స్పష్టంచేశారు. తెలంగాణలో షిండే తరహా రాజకీయాలు సాగవని తేల్చిచెప్పారు. పార్టీ మారాలంటూ తనకు వచ్చిన ప్రతిపాదనను తిరస్కరించానన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ‘రాజకీయాల్లో ఉన్నవాళ్లకు చాలామంది మిత్రులు ఉంటరు.
ఎన్నో రకాలుగా ప్రతిపాదనలు వారినుంచి వస్తుంటాయి. ఐయాం ఏ డీసెంట్ పొలిటీషియన్ (నేను హుందాగా వ్యవహరించే రాజకీయనాయకురాలిని). దేశ రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగాలనుకుంటున్న. నేనెవరి పేరునూ చెప్పదలుచుకోలేదు. కానీ, బీజేపీ సన్నిహితులు, ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న సంస్థల మిత్రులు నన్ను బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. షిండే మాడల్ రాజకీయాలు చేద్దాం రమ్మన్నారు. తెలంగాణ ప్రజలు తమ సొంత రాజకీయ పార్టీలను, సొంత నాయకులను మోసం చేయరు. కడుపులో పెట్టుకుని కాపాడుకుంటరు. మేం సొంతబలం మీదే నాయకులుగా నిలబడతాం. అడ్డదారిలో కాదు. వాళ్ల ప్రతిపాదనను నిర్దంద్వంగా తిరస్కరించాను’ అని కవిత తెలిపారు. రాజకీయ నాయకులుగా ప్రజల్లోనే ఉంటామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని ఆమె చెప్పారు. తనకు జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కేసీఆర్ నాయకత్వంలోనే జీవితాంతం పనిచేస్తానని మరోసారి తేల్చిచెప్పారు.
ఎలాంటి సమన్లూ రాలేదు..
లిక్కర్స్కాంకు సంబంధించి తనకు అధికారికంగా ఎలాంటి సమన్లు అందలేదని కవిత స్పష్టంచేశారు. బీజేపీనాయకులు మాత్రం అనధికారికంగా రోజుకో లీకు ప్రచారంలో పెడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో తనపై ఎవరూ మాట్లాడొద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని కవిత గుర్తుచేశారు.
బీజేపీ నేతలపై ఈడీ కేసులు ఎందుకు లేవు?
బీజేపీ నేతలపై ఈడీ దాడులు ఎందుకు జరగవని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 25వేల మంది ప్రతిపక్ష నాయకులపై ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు నమోదు చేశారని ఆమె వివరించారు. ఇందులో ఒక్క బీజేపీ నేతపైనా కేసులు ఎందుకు నమోదు కాలేదని ప్రజలే ఆశ్చర్యపోతున్నారని ఆమె పేర్కొన్నారు. బీజేపీ నేతల ఇండ్లకు ఈడీ, ఐటీలు ఎందుకు వెళ్లవని ఆమె నిలదీశారు. ‘బీజేపీలో చేరగానే పవిత్ర గంగాజలంతో పునీతులు అవుతారా? ఆ పార్టీలో చేరగానే వాషింగ్ పౌడర్లా స్వచ్ఛంగా మారిపోతారా? జై మోదీ.. అంటే నై ఈడీలా బీజేపీ వ్యవహరిస్తున్నది. సీబీఐ, ఈడీ ఐటీ కేసులున్నవాళ్లంతా పునీతులు అయ్యేవిధంగా బీజేపీ ఎలా వ్యవహరిస్తున్నదో దేశమంతా చూస్తున్నది. ఇలాంటి రాజకీయాలు ఎంతోకాలం సాగవు’ అని కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ చిల్లర వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీలను బీజేపీ ఎలా అల్లుండ్లలా వాడుకుంటున్నదో బీహా ర్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ చెప్పిన ఉదాహరణను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవల జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఈడీ, సీబీఐ, ఐటీ వ్యహారాలపై చేసిన కామెంట్లను కూడా కవిత ఉదహరించారు.
తెలంగాణ మాడల్ దేశానికి అనివార్యం
తెలంగాణ మాడల్ దేశానికి అనివార్యమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని రంగాలను అద్భుతంగా తీర్చిదిద్దారని, కేసీఆర్ నాయకత్వం లో దేశం పురోగమిస్తుందనే విశ్వాసం దేశ ప్రజల్లో నెలకొంటున్నదని ఆమె చెప్పారు. ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మా రిందని ఈ నేపథ్యంలో తాము జాతీయస్థాయిలో పనిచేస్తామన్నారు. ఆయా రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలు దేశ ప్రజల ముందు ఉన్నాయని చెప్పారు.
కాంగ్రెస్తో టచ్లో ఉన్నదెవరు?
బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన నిరాధార ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నది అర్విందేనని అన్నారు. బీజేపీలో ఉన్న అర్వింద్కు కాంగ్రెస్తో ఏం పని అని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లకు పైసలు ఇచ్చింది అర్విందేనని అని ఆమె ధ్వజమెత్తారు. ఇటువంటి నాయకుడు నిజామాబాద్ ఎంపీ కావడం ప్రజల దురదృష్టమన్నారు. తాను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడానంటూ చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధమని ఆమె తేల్చిచెప్పారు. తాను ఖర్గేతో మాట్లాడానా.. లేదా.. అనే విషయాన్ని మీడియా ఖర్గేకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని అన్నారు. తన బతుకు, తన పుట్టుక తెలంగాణే అని ఆమె స్పష్టంచేశారు. తెలంగాణ పేరులేని, తెలంగాణ నాయకత్వంలేని పార్టీలో తాను ఎప్పటికీ ఉండబోనని ఆమె తేల్చిచెప్పారు. తనను అభాసుపాలు చేయాలని ఎంపీ అర్వింద్ అర్థం పర్థం లేని అభాండాలు వేస్తే.. తెలంగాణ ప్రజలెవరూ నమ్మరని కవిత తెలిపారు.