హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బెడిసికొట్టడంతో బీజేపీకి మైండ్ బ్లాంక్ అయ్యింది. నెత్తిమీద పెద్ద బాంబు పడినట్టుగా తయారైందని, బుధవారం రాత్రి నుంచి అందరి ముఖాలు మాడిపోయాయని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ నుంచి నేతలు వరుసగా బయటికి వెళ్లిపోతుండటం ముఖ్య నేతల మధ్య మనస్పర్థలకు దారి తీసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ పరువు పోవడంతో పార్టీలో ముసలం పుట్టిందని సమాచారం. విషయం మీడియాలో రాగానే ఢిల్లీ నుంచి పార్టీ పెద్దలు ఫోన్ చేసి ‘ఈ మ్యాటర్ ఎలా లీక్ అయ్యింది?’ అని రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీసినట్టు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా కీలక నేతలందరికీ ఫోన్ చేసి ‘ఇంత కీలక ఆపరేషన్ను జాగ్రత్తగా చేయలేరా?’ అని తలంటినట్టు సమాచారం. ముఖ్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యాలయం నుంచి వరుసగా ఫోన్లు వస్తున్నాయని తెలిసింది. ‘ఆ స్వామీజీలను అనవసరంగా ఇరికించారు. మన రాజకీయ వ్యూహాల్లో వాళ్లు కీలక వ్యక్తులు. వాళ్ల దగ్గర మనకు సంబంధించిన ఎంతో సమాచారం ఉన్నది’ అని ఆందోళన వ్యక్తం చేశారని, వారిని ఎలాగైనా వెంటనే బయటికి రప్పించాలని ఆదేశించినట్టు తెలిసింది. మోదీ, షాకు ద్వయానికి దగ్గరి వ్యక్తి బీఎల్ సంతోష్ సైతం ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.
ఏమేం మాట్లాడుకున్నాం?
పోలీసులు పక్కాగా ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని చెప్పడంతో బీజేపీ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అవుతున్నది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం హడలిపోతున్నారు. ‘ఆ నలుగురు ఎమ్మెల్యేలతో, మధ్యవర్తులతో ఏమేం మాట్లాడాం?’ అని ఓసారి పునఃపరిశీలన చేసుకొంటున్నట్టు తెలిసింది. ఎవరెవరు ఫోన్లలో ఏ విషయాలు మాట్లాడారు? నేరుగా కలిసినప్పుడు ఏమేం విషయాలు చెప్పారు? దొరికిన మధ్యవర్తులు ఏ విషయాలు చెప్పి ఉంటారు? అని విశ్లేషిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా బీజేపీ అగ్రనేతలు నిందితులతో మాట్లాడినట్టు ఆడియో, వీడియో రికార్డింగ్ ఆధారాలు ఉన్నాయని తెలిసి వెన్నులో వణుకు పుడుతున్నట్టు సమాచారం. ఇలా మాట్లాడిన విషయాల్లో ఏయే అంశాలపై, ఎవరెవరికి న్యాయపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందో లాయర్ల బృందంతో చర్చలు జరుపుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆడియోలు, వీడియోలు బయటికి వస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటని రాష్ట్ర, జాతీయ నేతలు హడలిపోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘కేసీఆర్ లాంటి వ్యక్తికి మన జుట్టు దొరికితే ఊరుకుంటాడా?. కొరివితో తల గోక్కున్నట్టే. మన తతంగం దేశం మొత్తానికి అర్థమయ్యేలా పూసగుచ్చినట్టు వివరిస్తాడు. ఢిల్లీలో ప్రెస్మీట్ పెట్టి మన ఇజ్జత్ తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’ అని ముఖ్యనేతలు అన్నట్టు సమాచారం. ఇకపై బీజేపీ ముఖ్య నేతలు ఎవరూ ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడొద్దని, చాటింగ్ చేసుకోవద్దని, యాప్ కాల్స్ ద్వారా మాట్లాడుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. తప్పని పరిస్థితుల్లో పక్కన ఉన్నవారి ఫోన్ నుంచి చేసి మాట్లాడుకోవాలని సూచించినట్టు సమాచారం.
నడ్డా వచ్చే ముందే ఇలా..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 31న మునుగోడుకు రానున్నారు. ఈ సమయంలోనే పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుగుతండటంతో రాష్ట్ర నేతలకు ఎటూ పాలుపోవడం లేదు. ఒక్కరు వస్తే నలుగురు పార్టీని వీడుతుండటంపై ఇప్పటికే అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్, రాపోలు ఆనంద భాస్కర్ వంటి నేతలు వెళ్లిపోవడంపై అధిష్ఠానం సీరియస్ అయినట్టు తెలిసింది. బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి బండి సంజయ్ సహా ముఖ్య నేతలందరికీ ఫోన్లు చేసి వివరణ తీసుకున్నట్టు సమాచారం. ‘వాళ్లంతా ప్రజాదరణ లేని నేతలు’ అని కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నించగా.. ‘మరి ఎందుకు చేర్చుకొనే ప్రయత్నం చేసినట్టు? చేరికల కమిటీ ఫెయిల్ అయ్యిందా?’ అంటూ క్లాస్ పీకినట్టు సమాచారం. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో నేరాన్ని కప్పిపుచ్చుకొనేందుకు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, కిషన్రెడ్డి, లక్ష్మణ్.. ఇలా నేతలంతా క్యూకట్టి మరీ ప్రెస్మీట్లు పెడుతున్నారు. ఇప్పటికే బీజేపీపై ప్రజల్లో నమ్మకం లేదని, తాజా ఘటనతో పూర్తిగా అధఃపాతాలనికి పడిపోయామని క్షేత్రస్థాయి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ను అడ్డుకోవాలన్న దురాశతో కేంద్రం ప్రభుత్వం తన కిందికి నీళ్లు తెచ్చుకొన్నదని విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలతో డీల్ చేయటలో పొరపాటుపడ్డామని రాష్ట్ర బీజేపీ నేతలు అంగీకరించినట్టు సమాచారం. కొందరేమో ఈ సమస్య మొత్తం కేంద్రమంత్రి కిషన్రెడ్డిదేనని తేల్చేసినట్టు సమాచారం. ‘దొరికితే దొరికాం కానీ.. కేసీఆర్తో ఎలా డీల్ చేయాలో తెలిసివచ్చింది’ అని బీజేపీ జాతీయ నేత ఒకరు అన్నట్టు సమాచారం.
డైవర్షన్ డ్రామా..
దేశవ్యాప్తంగా బీజేపీ పరువు పోవడంతో ప్రజల దృష్టిని ఎలాగైనా మళ్లించాలని రాష్ట్ర నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే బండి సంజయ్ శుక్రవారం యాదాద్రికి వెళ్లనున్నారు. సాక్షాధారాలతో సహా బీజేపీ అనుకూల వ్యక్తులు అడ్డంగా దొరికిపోతే.. తలదించుకోవాల్సింది పోయి ‘సీఎం వచ్చి లక్ష్మీనరసింహ స్వామి మీద ప్రమాణం చేయాలి’ అంటూ దొంగ నాటకాలకు తెరలేపారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే బీజేపీ నేతలు ఒకరి వెనుక ఒకరు ఈ సవాల్ విసురుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
నేరం నాది కాదు..
ఎంతో నమ్మి అప్పగించిన ఆపరేషన్ ఫెయిల్ కావడం, ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోవడంతో రాష్ట్ర బీజేపీ నేతలు తమ అసమర్థతను కప్పిపుచ్చుకొనేందుకు ప్రయ త్నం చేస్తున్నట్టు సమాచారం. అంతర్గతంగా ఒకరి మీద ఒకరు నింద వేసుకుంటున్నట్టు చెప్పుకొంటున్నారు. ఇటీవల పార్టీలో చేరిన కీలక నేతల్లో ఒకరిద్దరు కోవర్టులు ఉన్నారని బండి సంజయ్ తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు తెలిసింది. తనను ఇరికించడానికే ఈ విషయంపై పోలీసులకు, మీడియాకు లీక్ ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. ఈ దెబ్బకు బండి సంజయ్ని పదవి నుంచి తొలిగిస్తే తమకు లైన్ క్లియర్ అవుతుందని రఘునందన్రావు, ఈటల రాజేందర్ లోలోన సంతోషపడుతున్నట్టు పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు. నందకుమార్ను బూచిగా చూపి కిషన్రెడ్డిపైగానీ, చేరికల్లో వైఫల్యం అనే కారణం చూపి చేరికల కమిటీ చైర్మన్గా ఉన్న ఈటల రాజేందర్పైగానీ చర్యతీసుకొనేలా మరికొందరు పావులు కదుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
కోర్టుకు ఎందుకు పోయినట్టు?
ఫామ్ హౌజ్లో దొరికిన నిందితులతో తమకు సంబంధాలు లేవని బీజేపీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా నందకుమార్తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. మరి అలాంటిది కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ నేతలు హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని నెటిజన్లు నిలదీస్తున్నారు. రామచంద్ర భారతి, సింహయాజీ స్వామికి అమిత్ షా, నడ్డా, యోగి ఆదిత్యనాథ్ వంటి బీజేపీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వాళ్లు నోరు విప్పితే అందరి జాతకాలు బయటికి వస్తాయని, కనీసం వాళ్లను రాష్ట్ర పోలీస్ పరిధి నుంచి తప్పించాలని ఢిల్లీ పెద్దలు ఆదేశించినట్టు తెలిసింది. సీబీఐ చేతుల్లోకి వస్తే అంతా తాము చూసుకుంటామని చెప్పినట్టు స్పందించారు.