కరీంనగర్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సొంత గడ్డపైనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్లో ఈ నెల 15న జరిగిన ప్రజా సంగ్రామ సభ అట్టర్ ఫ్లాప్తో పరాభవాన్ని మూటగట్టుకున్న సంజయ్.. సొంత గడ్డపై జరిగిన సెస్ ఎన్నికల్లో ఘోర పరాభావాన్ని చవిచూశారు.ఈ ఎన్నికల్లో అన్నీ తానై ప్రచార బాధ్యతలు భుజాన వేసుకొన్నాడు. బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎన్నో పచ్చి అబద్ధాలు చెప్పారు. అయినా కానీ బండి కల్లబొల్లి మాటలను ప్రజలు విశ్వసించలేదు. అభివృద్ధికి కేరాఫ్గా నిలిచిన మంత్రి కేటీఆర్కే ప్రజలు అండగా నిలిచారు. సెస్ ఎన్నికల ఫలితాలు బీజేపీని ఖంగు తినిపించగా బీఆర్ఎస్లో కొత్త జోష్ను నింపాయి.
దెబ్బ మీద దెబ్బ
సెస్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని బండి సంజయ్ తన శక్తి యుక్తులను వాడారు. ఎన్నికల్లో వాస్తవాలను చెప్పకుండా అన్నింటినీ వక్రీకరించారు. సెస్ ఎన్నికలు చాలా చిన్నవని చెబుతూనే తానే స్వయంగా ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా పచ్చి అబద్ధాలు చెప్పారే తప్ప బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే ఏం చేస్తారో ఏమీ చెప్పలేకపోయారు. ఈ నెల 15న కరీంనగర్లో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ జరిగింది. ఈ సభకు భారీ మొత్తంలో జనాలను తరలించి సొంత గడ్డపై సత్తా చాటుకోవాలని విశ్వ ప్రయత్నం చేశారు. ఆ మేరకు స్థానిక నాయకత్వాన్ని నమ్మకుండా జనం తరలింపు కోసం వేరే ప్రాంతాల నాయకులకు బాధ్యతలు అప్పగించి డబ్బులు వెదజల్లారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా సభ అట్టర్ ఫ్లాప్ అయింది. సొంతగడ్డపై సభ అట్టర్ ఫ్లాప్ కావడంతో ప్రజలను, పార్టీ దృష్టిని మళ్లించడానికి సెస్ ఎన్నికలను అస్త్రంగా వాడుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలవడానికి ఆయన తొకిన అడ్డదారులు, చెప్పిన పచ్చి అబద్ధాలు, కుట్రలు మొత్తం రివర్స్ అయ్యాయి.
విశ్వసించని వినియోగదారులు
నిజానికి సెస్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో స్వయంగా బండి సంజయ్ ప్రచార బాధ్యతలను నెత్తికెత్తుకున్నారు. స్థానిక నాయకులను ఇన్చార్జీలుగా పెడితే ఆయన అడ్డదారులపై ప్రశ్నించే అవకాశం ఉందనే భావంతో ఇతర ప్రాంతాల నాయకులను ఇన్చార్జీలుగా పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఇక్కడితో ఆగకుండా అసత్యాలు ప్రచారం చేశారు. బీఆర్ఎస్తో పాటు మంత్రి కేటీఆర్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబును ఆ ప్రాంత అభివృద్ధితోపాటు సెస్ అభివృద్ధికి ఏమీ చేయలేదని ప్రజలను నమ్మించేందుకు పచ్చి అబద్ధాలు చెప్పారు. సంజయ్ ఎన్ని చెప్పినా.. పలు అడ్డదారులు తొక్కినా.. సెస్ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలవడానికి కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు మాత్రం సంజయ్ను విశ్వసించలేదు. గారడి మాటలు చెప్పే వారికి గట్టి బుద్ది చెప్పాలన్న లక్ష్యంతో ముందుకెళ్లిన ఓటర్లు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కు, మంత్రి కేటీఆర్ ప్రతిపాదించిన బీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కట్టి ఆశీర్వదించారు. దీంతో బండికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎటువంటి పట్టు లేదని మరోసారి స్పష్టమైంది. స్థానిక పరిస్థితులపై అవగాహన లేకపోవడం, కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని వక్రీకరించాలనే ప్రయత్నం చేయడం, సెస్ పురోగతికి చేసిన ఎన్నో అభివృద్ధి పనులకు సంబంధించిన ఫలాలు వినియోగదారులకు అందుతున్నా మంత్రి కేటీఆర్ ఏమీ చేయలేదని చేసిన ప్రచారాలకు వినియోగదారులు బండికి సరైన పద్ధతిలో సమాధానం చెప్పారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రగల్భాలకే పరిమితం..
సెస్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని, బీఆర్ఎస్ను ప్రజలు విశ్వసించడం లేదని సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని ప్రచారంలో బండి సంజయ్ ప్రగల్భాలు పలికారు. అక్కడితో ఆగకుండా ఈనెల 24న రాష్ట్ర పార్టీ నాయకులతో బండి సంజయ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తాను చేసిన ప్రచారం వల్లే గెలవబోతున్నామనే భావన వచ్చేలా పార్టీ నాయకులకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా సెస్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అనుభవం ఉన్న పార్టీ సీనియర్ నేతలున్నప్పటికీ వారికి బాధ్యతలు ఇవ్వకుండా జిల్లాయేతర వ్యక్తులను తీసుకొచ్చి మండలాలకు ఇన్చార్జులుగా నియమించారు. వారి ద్వారానే డబ్బులు కూడా పంపిణీ చేయించారు. ఈ వ్యవహారంపై లోకల్ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. సెస్ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బండి సంజయ్ ఎంచుకున్న మార్గాలే కారణమని బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.