కరీంనగర్ : బీజేపీలో చేరిన ఈటల రాజేందర్పై ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మండల, గ్రామ కార్యకర్తలను పట్టించుకోకుండా.. కనీస మర్యాద ఇవ్వకుండా ఈటల రాజేందర్ ప్రవర్తిస్తున్నారని ఇల్లందకుంట బీజేపీ మండల అధ్యక్షులు నన్నబోయిన రవియాదవ్ ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్ తన అనుచరులతో మండలాల్లో పర్యటిస్తూ బీజేపీని నమ్ముకుని పని చేస్తున్న నాయకుల ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారని కోపోద్రిక్తులయ్యారు. ఆస్తులను కాపాడుకునేందుకు ఈటల బీజేపీలో చేరారని పేర్కొన్నారు.
ఈటల రాజేందర్ వల్ల అభివృద్ధి జరగదు. కుట్రపూరితమైన ఆలోచనలు చేయడంలో ఈటల దిట్ట అని రవి యాదవ్ పేర్కొన్నారు. ఈటల తీరుతో తమ ఆత్మగౌరవం కూడా దెబ్బతిన్నదని రవి యాదవ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రవి యాదవ్ పేర్కొన్నారు. రవి యాదవ్తో పాటు తోడేటి జితేందర్ గౌడ్, ఎల్లవేన అనిల్, తనుగుల తిరుపతి యాదవ్, గుత్తికొండ పవన్, గుత్తికొండ రాంబాబు, మాదాసు తిరుమలతో పాటు 200 మంది కార్యకర్తలు బీజేపీకి రాజీనామా చేశారు.