వినాయక్నగర్, మార్చి 5: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అహంకారి, దుర్మార్గుడు అని బీజేపీ నేత మీసాల శ్రీనివాసరావు, ఆయన సతీమణి, నిజామాబాద్ 19వ డివిజన్ కార్పొరేటర్ సవిత విమర్శించారు. అర్వింద్ కాషాయం కప్పుకున్న కసాయి అని, లోక్సభ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని మండిపడ్డారు. అర్వింద్కు టికెట్ ఇవ్వొద్దని రాష్ట్ర పార్టీ నేతలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, దీంతో నేరుగా అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లిన శ్రీనివాసరావు అక్కడ మంగళవారం మీడియాతో మాట్లాడారు. మరోవైపు, అర్వింద్పై నిరసన గళం విప్పిన శ్రీనివాసరావు దంపతులను పార్టీ సస్పెండ్ చేసింది.
నిజామాబాద్ ప్రజలు అర్వింద్ బాధితులని దంపతులు పేర్కొన్నారు. పార్లమెంట్లో ఇంత టెంపర్ ఉన్న వ్యక్తి మరొకరు లేరని, అలాంటి వ్యక్తికి మరోసారి టికెట్ ఇచ్చి బీజేపీ తప్పు చేసిందని మండిపడ్డారు. ఆయనకు బదులు డేరాబాబా, నిత్యానందకు టికెట్ ఇచ్చినా తాము ఇక్కడి (ఢిల్లీ)కి వచ్చే వాళ్లం కాదని తెలిపారు. నిజామాబాద్లోని 17 లక్షల మంది ఓటర్ల కోరిక మేరకు అభ్యర్థిని మార్చాలని, అర్వింద్కు టికెట్ ఇవ్వొద్దని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని తెలిపారన్నారు. రాష్ట్ర నాయకత్వం నుంచి సరైన సమాధానం రాక మోదీ, అమిత్షా సహా జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయడానికి వచ్చామని చెప్పారు. అర్వింద్కు టికెట్ ఇస్తే బీజేపీకి నష్టం జరుగుతుందని తెలిపారు. అర్వింద్కు దమ్ముంటే స్వతంత్ర అభ్యర్థిగా గెలవాలని సవాల్ చేశారు. ఎంపీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు.
సస్పెన్షన్ వేటు..
అర్వింద్కు వ్యతిరేకంగా గళమెత్తిన సీనియర్ నేత శ్రీనివాసరావు, కార్పొరేటర్ సవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించి, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంతో సస్పెండ్ చేస్తున్నట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి తెలిపారు.