హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మియాపూర్ ఆల్విన్ కాలనీలో జ్ఞానేంద్ర ప్రసాద్ నివాసముంటున్నాడు. ప్రసాద్ తన ఇంట్లోనే ఉరేసుకున్నాడు.
ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు.. ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రసాద్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జ్ఞానేంద్ర ప్రసాద్ మృతిపట్ల పలువురు బీజేపీ నాయకులు సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.