హైదరాబాద్ సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): డాటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో వేలాదిమందిని మోసగించి భారీగా డబ్బు దండుకున్న బీజేపీ నాయకుడు గడగోని చక్రధర్గౌడ్ లీలలు ‘మోసగాళ్లు’ సినిమాను మైమరిపిస్తున్నాయి. నిరుద్యోగుల నుంచి ఆయన ఏకంగా రూ.50 కోట్లు దండుకున్నట్టు తెలుస్తున్నది. డాటా ఎంట్రీ జాబ్స్తోపాటు ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ వెబ్సైట్లను సృష్టించి ఎంతో మందిని మోసగించినట్టు పోలీసుల విచారణలో వెల్లడవుతున్నది. ఇంట్లో వేల రూపాయల విలువైన మద్యం బాటిళ్లను నిల్వ చేసుకుని, ఒంటి నిండా కిలోల కొద్దీ బంగారు ఆభరణాలను వేసుకుని ఆర్భాటాన్ని ప్రదర్శిస్తున్న చక్రధర్గౌడ్.. తన కార్యాలయంలో ఇంటర్నెట్ వాడడు. ఎలాంటి మోసాన్నైనా సిమ్కార్డుతోనే కానిచ్చేస్తాడు. సిద్దిపేటలో తనకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు సుమారు 200 మంది ఇన్ఫ్లుయెన్సర్లను నియమించుకొని ఒక్కొక్కరికి నెలకు రూ.20 వేల జీతం ఇస్తున్నాడు.
ఉద్యోగార్థుల డాటాను వివిధ వెబ్సైట్ల నుంచి సేకరించే చక్రధర్గౌడ్.. ఒకేసారి లక్ష మంది డాటాను కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. డాటా ఎంట్రీ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ తదితర ఉద్యోగాల పేరుతో వారికి ఎరవేసేందుకు వివిధ కంపెనీల పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించినట్టు సమాచారం. అమాయకుల డాటాను ఆయా వెబ్సైట్లలో స్టోర్ చేసి ఆ తర్వాత వారిని పంజాగుట్టలోని కార్యాలయం నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇంటర్వ్యూలకు ముందే ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి 20 వేల వరకు డిపాజిట్ చేయించుకుని నెలకు దాదాపు రూ.5కోట్లు వసూలు చేస్తున్నట్టు సమాచారం.
ఈ దందా కోసం ఉద్యోగులను నియమించుకునేందుకు చక్రధర్గౌడ్ ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర రాష్ర్టాల్లో ప్రకటనలు ఇస్తున్నాడు. ఆయా రాష్ర్టాల్లోని పేద యువతకు స్టార్ హోటళ్లలో జాబ్ మేళాలు, ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగులుగా నియమించుకుంటున్నాడు. వీరంతా అమాయకులను మోసగించి వసూలు చేసే డబ్బును తొలుత వ్యాలెట్లలోకి డిపాజిట్ చేయిస్తున్నాడు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని వివిధ ప్రాంతాల్లోని వ్యక్తుల కరెంట్ ఖాతాల్లోకి మళ్లించి పంజాగుట్ట, మౌలాలిలోని బ్యాంకుల్లో సెల్ఫ్ చెక్కుల ద్వారా విత్డ్రా చేస్తున్నాడు.