Etela Rajender | అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ మాటలు తప్ప హామీల అమలు లేదని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాలు విసిరారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. డిక్లరేషన్ల పేరుతో ఎన్నికల సమయంలో హడావుడి చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు హామీల అమలును గాలికి వదిలేసిందని మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా హామీలను నిలబెట్టుకోలేదని అన్నారు. ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న పార్టీలకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గుణపాఠం నేర్పించాలని అన్నారు. నోటుతో ఓటును కొనాలని చూసేవారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.