Chakradhar goud | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల పేరుతో దేశవ్యాప్తంగా వేలమంది నిరుద్యోగ యువతను మోసగించిన బీజేపీ నేత గడగోని చక్రధర్గౌడ్ పాపాల చిట్టాపై పోలీసులు దృష్టిసారించారు. ఈ మోసాల ద్వారా ఆన్లైన్లో అతను సేకరించిన డబ్బంతా పెట్రోల్ బంకుల ఖాతాల్లోకి మళ్లించి పక్కా ప్లాన్తో వైట్గా మార్చేవాడని విచారణలో బయటకు వచ్చింది. ఈ పాపపు సొమ్ముతో రాజకీయంగా ఎదగాలని ప్లాన్ వేసుకున్న చక్రధర్గౌడ్ తన అక్రమాలకు బీజేపీ అండగా నిలిచేలా చూసుకునేందుకు ఆ పార్టీ పంచన చేరాడు. ఆపై తనకు రాజకీయాలు ఒంటపడుతాయా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవడం కోసం కొంతమంది స్వామీజీల అభిప్రాయాలను తీసుకున్నాడు. ఒక పక్క చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే మరోవైపు రాజకీయ నాయకుడిగా, సంఘ సేవకుడిగా అవతారమెత్తిన చక్రధర్గౌడ్ను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా తొలుత అనంతపురంలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ తో లింక్ అయిన సిమ్కార్డులను ఒక్కొక్కటి వెయ్యి రూపాయలకు కొనుగోలు చేసిన వ్యవహారంపై దృష్టిపెట్టారు. అక్కడి నుంచి ఎన్ని సిమ్లు కొన్నాడు? ఎంతమంది నుంచి కొన్నాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
నిరుద్యోగ యువతను మోసగించి ప్రతి నెలా కోట్ల రూపాయలు దండుకొంటున్న చక్రధర్గౌడ్ ఆ సొమ్మును తన వ్యాలెట్ల నుంచి సొంత కరెంట్ ఖాతాలతోపాటు హైదరాబాద్, సిద్దిపేటలోని 7 పెట్రోల్ బంకుల ఖాతాలకు ఏ రోజుకారోజు మళ్లించినట్టు సమాచారం. ఆ సొమ్ములో పెట్రోల్ బంకుల నిర్వాహకులు 3% కమీషన్ను మినహాయించుకుని మిగతా నగదును నేరుగా చక్రధర్గౌడ్ సంబంధీకులకు అందజేసేవారని తెలిసింది. దీంతో ఆయా పెట్రోల్ బంక్లకు డిపాజిట్ అయిన నగదుపై కూడా పోలీసులు దృష్టి పెట్టి పక్కాగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాను శ్రీమంతుడినని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున సిద్దిపేట నుంచి పోటీ చేయబోతున్నానని ప్రచారం చేసుకుంటున్న చక్రధర్గౌడ్.. అక్కడ ఏకంగా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వారికి నెలవారీగా జీతాలు ఇస్తున్నట్టు బయటపడింది. దీంతో చక్రధర్గౌడ్ అకస్మాత్తుగా ఎలా శ్రీమంతుడయ్యాడు? అతనికి ఎక్కడి నుంచి డబ్బు వస్తున్నది? అని ఎవరైనా ఆరా తీస్తే వెంటనే తన అనుచరుల ద్వారా తెలుసుకునేవాడు. ఆ తర్వాత గుర్తుతెలియని నంబర్ల నుంచి వారికి ఫోన్లు చేసి బెదిరింపులకు, బ్లాక్మెయిలింగ్లకు దిగేవాడని, ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారితో రాజీ కుదుర్చుకునేవాడని స్థానికులు చెప్తున్నారు. రాజకీయంగా ఎదగాలన్న ప్లాన్లో భాగంగా చక్రధర్గౌడ్.. సోషల్ మీడియాలో తన తరఫున ప్రచారం చేయించుకునేందుకు దాదాపు 200 మంది ఇన్ఫ్లుయెన్సర్లను ఏర్పాటు చేసుకోవడంతోపాటు కొన్ని యూట్యూబ్ చానళ్ల నిర్వాహకులతోనూ నెలవారీ ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. వారందరికీ చక్రధర్గౌడ్ ఇస్తున్నది పాపపు సొమ్మేనని ఇటీవల పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు.