హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతలను కాపాడే పోలీసులపై దాడులు చేయండి అంటూ వాట్సాప్ వేదికగా తమ కుట్రబుద్ధిని చాటుకున్నాడో బీజేపీ ప్రజాప్రతినిధి. తెలంగాణలో పోలీసులపై దాడులు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మన్సూరాబాద్ బీజీపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డిపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమబెంగాల్లో ఒక పోలీస్ అధికారిని బీజీపీ జెండాలు పట్టుకొని అక్కడి నాయకులు, కార్యకర్తలు దాడిచేస్తూ తరిమికొడుతున్న వీడియో సోషల్మీడియాలో వైరల్ అయ్యింది.
ఆ వీడియో చూసిన ఒక పౌరుడు ‘ఎల్బీనగర్ డెవలప్మెంట్ ఫోరం’ అనే వాట్సాప్ గ్రూప్లో.. ‘ఇది బీజేపీ రౌడీయిజానికి ఉదాహరణ. ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్నే ఇలా కొడితే.. సామాన్య ప్రజల సంగతేంటి? ప్రజలారా మేల్కొనాలి’ అంటూ ఈ వీడియోకు మేసేజ్ పెట్టి షేర్ చేశాడు. దీనికి స్పందించిన బీజేపీ మన్సూరాబాద్ కార్పొరేటర్ నర్సింహారెడ్డి తెలంగాణలోనూ ఇలాగే జరుగాలంటూ ఆ వీడియోను ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీనిపై సోషల్మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఎల్బీనగర్ పోలీసులు ఆయనపై 153ఎ, 505(2), 506, 189 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.